మంచిర్యాల టౌన్, డిసెంబర్ 29 : భవిష్యత్ అంతా మనదేనని, కార్యకర్తలెవ్వరూ అధైర్య పడవద్దని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శుక్రవారం మంచిర్యాలలోని ఎస్వీఎస్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన బీఆర్ఎస్ మంచిర్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గులాబీ సైనికులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ప్రజలు ఇప్పటికీ కేసీఆర్ పాలనే కోరుకుంటున్నారన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా ఇంకా గందరగోళ పరిస్థితులే కనిపిస్తున్నాయని, ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చింది లేదని, ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని సూచించారు.
కేసీఆర్ పాలనలో ఇక్కడి ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ఇప్పుడు కూల్చివేతలు, బెదిరింపులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. పదవులను అనుభవించి స్వార్థం కోసం పార్టీ మారుతున్న వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పదేళ్లలో అనేక అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని కొనియాడారు. నిత్యం ప్రజలతో మమేకమై ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఓటమితో కుంగిపోవద్దని, అండగా ఉంటామని, పార్టీకోసం పనిచేసేవారందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటామని భరోసానిచ్చారు. పాతమంచిర్యాల నుంచి రసూల్పల్లి వరకు రోడ్డు విస్తరణ, విద్యుదీకరణ, మంచిర్యాల పట్టణంలో నాలుగు జంక్షన్ల అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనివేనని, మున్సిపాలిటీలకు రూ. కోటి, పల్లెలకు రూ. 10 లక్షల చొప్పున మంజూరై ఉన్నాయని, వాటి పనులు పూర్తయ్యేసరికి దాదాపు ఏడాది పడుతుందన్నారు.
ఈ లోగా స్థానిక సంస్థల ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వస్తాయని అన్నారు. ఈ లోగా పార్టీ శ్రేణులంతా సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంతకుముందు నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు మెతక వైఖరిని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. యువనాయకులు విజిత్రావు మంచిర్యాలలోనే ఉండి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని కోరారు. ఈ సమావేశంలో మంచిర్యాల, నస్పూర్, లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్లు పెంట రాజయ్య, ప్రభాకర్, కాంతయ్య, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, మాజీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు విజిత్రావు, గాదెసత్యం, అక్కూరి సుబ్బయ్య, శ్రీనివాస్, గరిగంటి సరోజ, వెంకటేశ్వర్రావు, చిన్నయ్య, సత్తయ్య, బేర సత్యనారాయణ, గోగుల రవీందర్రెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు పెట్టెం లక్ష్మణ్, పానుగంటి సత్తయ్య, జక్కుల రాజేశం పాల్గొన్నారు.