ఎదులాపురం, డిసెంబర్ 13 : ఛత్రపతి శివాజీ పరిపాలన నేటికి ఆదర్శప్రాయమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్లోని రణదీవేనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముందుగా జోగు రామన్నకు నాయకులు శివాజీ మహారాజ్ చిత్రపటం అందజేసి శాలువాతో సన్మానించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. మొదట కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్పై ప్రజలు నమ్మకం పెట్టి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
శివాజీ మహారాజ్ పాలనతో లేనటువంటి అసమానతలను నేడు కొన్ని పార్టీలు చూయించడం సబబు కాదని హెచ్చరించారు. ఎల్లవేళలా ప్రజానీకానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. పల్లెలు, పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. పాత పనులు కాకుండా కొత్త పనులు చేసి వారి పారదర్శకతను నిలబెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు విజ్జగిరి నారాయణ, అధికార ప్రతినిధి గంగారెడ్డి, కౌన్సిలర్లు అశోక్స్వామి, వెనుగంటి ప్రకాశ్, భరత్ కుమార్, ఇమ్రాన్, నాయకులు పర్వీన్ ఫెరోజ్, మంచికట్ల ఆశమ్మ, నంద, రమ పాల్గొన్నారు.