మంచిర్యాలటౌన్, మార్చి 26 : “కాంగ్రెస్.. ఓ డ్రామా కంపెనీ. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ఎన్నికల కోడ్ అంటూ నాటకాలు ఆడుతున్నది. ప్రజలు ఆ పార్టీ మోసాలను గమనించాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి.’ అని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం మంచిర్యాలలోని కాలేజీరోడ్డు, బాలుర పాఠశాలలో మార్నింగ్ వాకర్స్ను మాజీ ఎమ్మెల్యే దివాకర్రావుతో కలిసి మాట్లాడారు. ఆపై డిగ్రీ కాలేజీ మైదానంలో స్థానికులతో కలిసి మెడిటేషన్ చేశారు. లేబర్అడ్డాలోని కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. అంతకుముందు పాత గర్మిళ్లలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆర్పీ రోడ్లోని టిఫిన్ సెంటర్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.
అనంతరం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఎన్నికలు వస్తున్నాయని వలస నాయకులు, వీకెండ్ వీరులు వస్తున్నారని, వారి ఆస్తుల కోసం, పరిశ్రమల రక్షణకోసం పరితపిస్తారే తప్ప ప్రజలకు చేసేదేమీ ఉండదన్నారు. 26 ఏళ్లుగా సింగరేణిలో కార్మికుడిగా పనిచేశానని, ఇక్కడి ప్రజ ల కష్టాలు, ఇబ్బందులు తెలుసునని, అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని చెప్పారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేకుండా ఉన్నానని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అస్థిత్వాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కారుగుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే జరిగిన పరిణామాలను గుర్తించి ప్రజలు మంచి ని ర్ణయం తీసుకోవాలని, ఎంపీ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కూలిందన్న సాకుతో మొత్తం రైతాంగానికి తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. అతి తక్కువ కాలంలో ఫెయిలైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే, అది కేవలం రేవంత్రెడ్డి ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు.
అందరికీ సుపరిచితుడైన కొప్పుల ఈశ్వర్ను పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, ఇక్కడి సమస్యలు, అవసరాలు తెలిసిన వ్యక్తిని ఎంపీగా గెలిపించుకుంటే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్మిక నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. ఈ మధ్య కాలంలో ఇష్టారాజ్యంగా కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని, ప్రతిపక్ష నాయకులను జైళ్లలో పెడుతున్నారని, ప్రతిపక్షం అనేదే లేకుండా చేస్తున్నారని, ఇదంతా ప్రజలు గమనించాలన్నారు.
కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలన్నీ మరచి, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి హోదాలో ఉండి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అనరాని మాటలు అంటున్నారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ, మహిళలకు రూ. 2500, రైతుబంధు, రూ. 500 బోనస్, తదితర హామీలిచ్చి మోసం చేసిందన్నారు. వరి పొలాలు ఎండిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ నాయకులు నడిపెల్లి విజిత్రావు, కౌన్సిలర్లు అంకం నరేశ్, గాదెసత్యం, నాయకులు సందె ల వెంకటేశ్, సుంకరి రమేశ్, తాజొద్దీన్, సుధీర్, శ్రీపతివాసు, శ్రీరాముల మల్లేశ్ పాల్గొన్నారు.