మంచిర్యాలటౌన్, మార్చి 2 : మేడిగడ్డ ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, నీళ్లు నింపి పంటలకు విడుదల చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో మేడిగడ్డ కార్యక్రమంలో పాల్గొని, మంచిర్యాలకు వచ్చిన ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. నీళ్లందక లక్షలాది ఎకరాలు ఎండుతున్నాయని, కాంగ్రెస్ నాయకులు చిన్న సమస్యను పెద్దగా చేసి చూపించడానికే తమ సమయాన్నంతా వెచ్చిస్తున్నారని మండిపడ్డారు.
సమస్యకు పరిష్కారం చూపించాల్సింది పోయి, ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా రాజకీయాలు మానుకొని ప్రాజెక్టు మరమ్మతులపై దృష్టి పెట్టాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల గోదావరిలో దాదాపు 150 కిలోమీటర్ల మేర నీరుండేదని, గోదావరికి ఇరుపక్కలా లక్షలాది ఎకరాల్లో పంటలు సాగయ్యేవన్నారు. గతంలో కడెం, గూడెం ఎత్తిపోతల పథకాలకు వెంటనే మరమ్మతులు చేసి రైతులకు సాగునీరందించామని గుర్తుచేశారు.