మంచిర్యాలటౌన్, మార్చి 22 : ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని వారు కోరుకున్నట్లుగానే మంచిర్యాల గోదావరి వద్దే హైలెవెల్ వంతెన నిర్మించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి నదిపై మంచిర్యాల – అంతర్గాంల మధ్యనే బ్రిడ్జి నిర్మిస్తే 18 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుందని, దీంతో ప్రజలకు, వాహనదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. పెద్దపల్లి, కరీంనగర్, హైదరాబాద్ వెళ్లే వారందరికీ సమయం ఆదా అవుతుందని, ప్రయాణ వ్యయం కూడా తగ్గుతుందని చెప్పారు.
అలాకాకుండా ముల్కల్ల నుంచి నిర్మిస్తే ప్రజలకు పెద్దగా లాభం ఉండదని, నిర్మాణ వ్యయం, భూసేకరణ, ఇతర పనులు చేపట్టేందుకు ఏళ్లు గడుస్తాయని తెలిపారు. ఇప్పటికే అంతర్గాం వైపు భూసేకరణ పూర్తి చేసుకున్నారని, టెండరు ప్రక్రియ పూర్తయిందని, ఈ ఎండాకాలంలోనే గోదావరిలో నీళ్లు లేని సమయంలో త్వరితగతిన వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు ముల్కల్ల వద్ద బ్రిడ్జి కడుతానని అంటున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
ఇక్కడి ప్రజల అభిప్రాయాలు ఆయనకు పట్టవా అని ప్రశ్నించారు. ముల్కల్ల దగ్గర నిర్మిస్తే 450 కోట్లు అవసరం ఉంటుందని, అదే ఇక్కడే కడితే కేవలం రూ. 164 కోట్లు ఖర్చు మాత్రమే అవుతుందన్నారు. పైగా ముల్కల్ల దగ్గర బ్రిడ్జి నిర్మిస్తే కేవలం ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే తగ్గుతుందని తెలిపారు. అక్రమంగా తిన్నది కక్కిస్తానని అంటున్నారని, 14 ఏళ్ల క్రితం నాయికినిపేట, మెట్పల్లి రైతుల భూములకు సంబంధించిన పరిహారం ఇప్పటివరకు ఇవ్వకుండా నొక్కేసింది ముందు కక్కమని హితవు పలికారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అంకం నరేశ్, శ్రీపతి శ్రీనివాస్, సుంకరి రమేశ్, మొగిలి శ్రీనివాస్, సిరిపురం శ్రీనివాస్, ఎర్రం తిరుపతి, తాజుద్దీన్, శ్రీరాముల మల్లేశ్ పాల్గొన్నారు.