ఆదిలాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, తాజా మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఓటమితో బీఆర్ఎస్ నాయకులు శోకసముద్రంలో మునిగిపోయారని, వారిని సముదాయించి ధైర్యం చెప్పినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని, నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు, సూచనలు అందజేస్తామన్నారు. పార్టీ శ్రేణులు, పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు.
తాను 36 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, గ్రామ సర్పంచ్గా, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసినట్లు పేర్కొన్నారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో రూ.5250 కోట్లతో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. కష్టసుఖాల్లో తనకు అండగా ఉన్న పార్టీ కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని కోరారు. పాత పనులను ఎమ్మెల్యే ప్రారంభించవద్దు, ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించవద్దని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న సూచించారు. ఎన్నికల ప్రచారంలో తాను ఎమ్మెల్యేగా ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని చెప్పిన పాయల్ శంకర్ తన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. ప్రభుత్వం నుంచి కొత్త పనులను మంజూరు చేయించుకొని కొబ్బరికాయ కొట్టాలని సూచించారు.
ఆదిలాబాద్లో విద్య, ఉపాధి కోసం వ్యవసాయ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా, ఉపాధి రంగాల్లో ఎంతో అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 70 శాతం ఉంటే కేంద్ర ప్రభుత్వం వాటా 30 శాతం అన్నారు. తను నియోజకవర్గ ప్రజలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు అన్ని వేళల్లో అందుబాటులో ఉండి సమస్యలపై పోరాటం చేస్తామని, కీలకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, బీఆర్ఎస్ నాయకులు మెట్టు ప్రహ్లాద్, అజయ్, రాజు, విజ్జిగిరి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.