నదీ జలాల వినియోగంపై దృష్టి పెట్టిన రాష్ట్ర సర్కారు, అనువైన చోట్ల ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములను సాగులోకి తెచ్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వీర్ధండి గ్రామం-మహారాష్ట్రంలోని చంద్రాపూర్ జిల్లా అడేగావ్ గ్రామం మధ్యనున్న వార్ధా నదిపై బరాజ్ నిర్మాణానికి అడుగులు వేస్తున్నది. ఈ మేరకు రూ. 4,874 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసింది. త్వరలోనే ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) అందజేయనున్నది. తాజాగా.. సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేయగా, ప్రాధాన్యం సంతరించుకున్నది. కాగా, ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని 2 లక్షల ఎకరాలకు సాగునీరందించే అవకాశమున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం వార్ధా నదిపై బరాజ్ నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు రూ.4,874 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసింది. త్వరలోనే పరిపాలనా అనుమతుల కోసం ప్రభుత్వానికి, ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ)కి అందజేయనున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని 11 మండల్లాల్లో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కౌటాల మండలం వీర్ధండి గ్రామం.. అటు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా అడేగావ్ గ్రామం మధ్యన వారా నదిపై బరాజ్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ బరాజ్ ద్వారా సిర్పూర్ నియోజకవర్గంలో 88,919 ఎకరాలు, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 19,556 ఎకరాలు, బెల్లంపల్లి నియోజకవర్గంలో 89,935 ఎకరాలకు సాగునీరు అందనున్నది. రూ. 4,874 కోట్లతో సాగునీటి పారుదల శాఖ డీటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను రూపొందించింది. త్వరలోనే కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అనుమతులకోసం పంపేందుకు సిద్ధమవుతోంది.
వార్ధానదిపై బరాజ్ నిర్మాణంతో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని 11 మండలాల్లో సుమారు 2 లక్ష ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూర్, చింతలమానెపల్లి, కౌటాల, సిర్పూర్-టీ, దహెగాం మండలాలతో పాటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రెబ్బెన, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, నెన్నెల, తాండూర్ మండలాల్లోని భూములకు సాగునీరు అందనుంది.
ఇప్పటికే వార్ధానదిపై బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి సర్వేలు చేపట్టిన అధికారులు డీపీఆర్ (డీటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) తయారు చేశారు. డీపీఆర్ తర్వాత బరాజ్ నిర్మాణానికి రూ. 4,874 కోట్లతో అంచనాలు తయారు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలం వీర్థండి – మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా అడేగావ్ గ్రామం మధ్యన గల వార్ధా నదిపై 653 మీటర్ల పొడవు, 12 మీటర్ల ఎత్తుతో 27 గేట్లతో బరాజ్ నిర్మించనున్నారు. బరాజ్ నుంచి ప్రధాన కాలువల వద్ద మూడు పంపు హౌస్(లిప్ట్లు)లు ఏర్పాటు చేయనున్నారు. వార్ధా బరాజ్ వద్ద నుంచి 11 కిలో మీటర్ల దూరంలో మొదటి పంపు హౌస్ ఉంటుంది. దీని ద్వారా అక్కడి నుంచి 55 కిలోమీటర్ల దూరంలో మరో పంపు హౌస్ ఏర్పాటు చేయనున్నారు. దీని నుంచి మూడో పంపు హౌస్కు నీరు చేరవేస్తారు. మొదటి పంపు హౌస్ నుంచి కాలువల ద్వారా కౌటాల మండలం కనికి చెరువులోకి పంపింగ్ చేస్తారు. రెండో పంపు హౌస్ నుంచి తాండూర్ మండలం అచ్చెలి చెరువులోకి నీటిని తరలిస్తారు. అచ్చెలి చెరువు నుంచి రెబ్బెన మండలం రోల్లపాడు చెరువు, మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం పోచలంపల్లి చెరువుల్లోకి నీటిని తరలిస్తారు. చెరువుల నుంచి కాలువల ద్వారా వ్యవసాయ భూములకు నీరు సరఫరా చేస్తారు.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవేళ్ల సుజల స్రవంతి పేరిట ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించింది. అయితే ప్రాజెక్టు నిర్మించకుండానే కాలువల తవ్వకం చేపట్టింది. 7 మీట్లర్ల వెడల్పు, 12 మీటర్ల లోతుతో 75 కిలోమీటర్ల మేర తవ్వకాలు పూర్తిచేసింది. కానీ.. బరాజ్ నిర్మాణం పూర్తికాకపోవడంతో కాలువలు నిరుపయోగంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం తాజాగా వార్ధా నదిపై నిర్మించనున్న బరాజ్తో ఈ కెనాల్లు వినియోగంలోకి రానున్నాయి. వార్ధానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న బరాజ్ నిర్మాణాన్ని ఎలాంటి అటవీ చిక్కులు రాకుండా, ముంపు సమస్యలు లేకుండా రూ.4,874 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు.
హైదరాబాద్లోని ఎర్రమంజిల్లోని జలసౌధ నుంచి గురువారం సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఈ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వార్ధా బరాజ్కు సంబంధించి రూ.4,874 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైందని, త్వరలోనే పరిపాలనా అనుమతుల కోసం ప్రభుత్వానికి, ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ)కి అందజేస్తామని తెలిపారు. అనంతరం ఇరిగేషన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.