లక్ష్మణచాంద, డిసెంబర్ 26: విద్యుత్ ఉచ్చులు పెట్టి చేపలు పడితే చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పీచర గ్రామంలో ఇటీవల విద్యుత్తో చేపలవేట సాగించి ఒకరి మృతికి కారణమైన వ్యక్తులను సోమవారం అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పీచర గ్రామానికి చెందిన బొమ్మరేని సురేశ్తో పాటు కాల్వ సతీశ్, బొమ్మరేని సాగర్, పిట్టల కాళిదాస్ కలిసి మండలంలోని ధర్మారం శివారులోని నీటికుంటలో విద్యుత్షాక్తో చేపలు పట్టాలని భావించారు.
కుంటపక్కనగల రైతుకు సమాచారం ఇవ్వకుండా బోరుబావి నుంచి అక్రమంగా విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. వారి నిర్లక్ష్యంతో బొమ్మరేని సురేశ్ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. కాల్వ సతీశ్, బొమ్మరేని సాగర్, పిట్టల కాళిదాస్పై కేసునమోదు చేసినట్లు తెలిపారు. 160 మీటర్ల సర్వీస్వైరు, కర్ర, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.