పేదింటి ఆడబిడ్డల పెండ్లికి తల్లిదండ్రులు రంది పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి-షాదీముబారక్ పేరిట పథకానికి శ్రీకారం చుట్టారు. ఎనిమిదిన్నరేండ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈ స్కీం నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నది. అప్పు చేయాల్సిన అవసరం లేకుండా పెండ్లిళ్లు అయిపోతున్నాయి. రాష్ట్ర సర్కారు ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00,116 ఇస్తుండగా.. దివ్యాంగ అమ్మాయిల వివాహానికి రూ.1,25,016 అందిస్తున్నది. నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 30,632 మందికి రూ.283 కోట్లు అందించారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఇంటికే చెక్కులు వస్తుండడంతో వారి కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
నిర్మల్, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ):ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆడపిల్లలు ఉన్న కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నాయి. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి తల్లిదండ్రులు రంది పడొద్దనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభు త్వం ఈ పథకాలను అమలు చేస్తున్నది. ఆడబిడ్డ వివాహానికి రూ.1,00,116లను సాయంగా అందజేస్తూ అండగా నిలుస్తున్నది. అదే దివ్యాంగ అమ్మాయిల వివాహానికైతే రూ.1,25, 016 ల చొప్పున అందజేస్తున్నది. 2014 అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన ఈ పథకంతో ఎంతో మంది పేదలకు మేలు చేకూరుస్తున్నది. నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు 30,632 మంది లబ్ధి పొందారు. ఆయా కుటుంబాలకు దాదాపు రూ. 283 కోట్లు పంపిణీ చేశారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులు అందిస్తుండడంతో వారి కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. రూ. 1,00,116లను ప్రభుత్వం అందిస్తుండడంతో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భారం తప్పుతున్నది. అంతే కాకుండా అప్పులు చేయాల్పిన అవసరం లేకుండా పోతున్నది. వివాహమైన వెంటనే స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటున్నారు. మంజూరైన చెక్కులను స్థానిక మంత్రి అల్లోల ఇంక్రరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖానాయక్ ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఈ నెల 10 నుంచి నియోజకవర్గంలోని సోన్, లక్ష్మణచాంద, మామడ, నిర్మల్ అర్బన్, నిర్మల్ రూరల్, సారంగాపూర్, దిలావర్పూర్, నర్సాపూర్(బీ) తదితర మండలాల్లోని 528మంది లబ్ధిదారులకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
జిల్లాలో 30,632 కుటుంబాలకు
పేదింట్లో ఆడ పిల్లల పెళ్లి వారి తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలిచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ పథకాల ద్వారా నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు 30,632 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. నిర్మల్ డివిజన్ పరిధిలో15,832మందికి రూ.133.60 కోట్లు పంపిణీ చేశారు. భైంసా డివిజన్ పరిధిలో 14,800 మందికి రూ.149.50 కోట్లు అందజేశారు. కాగా ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2014-15 లో 234 కుటుంబాలకు ఆర్థిక సాయం అందగా, 2015-16లో 1085 కుటుంబాలకు, 2016-17 లో 2413 కుటుంబాలకు, 2017-18లో 3526 కుటుంబాలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆర్థిక సాయం పొందాయి. 2018-19లో 4721 కుటుంబాలకు, 2019-20లో 2570 కుటుంబాలు, 2020-21లో 3755 కుటుంబాలు, 2021-22లో6927కుటుంబాలు, 2022-23లో ఇప్పటి వరకు5401 కుటుంబాలకు సాయం అందజేశారు. ఇలా మొత్తంగా ఆయా వర్గాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఇప్ప టి వరకు రూ. 283 కోట్లు ప్రభుత్వం అందజేసింది.
ఆడబిడ్డల వివాహాలకు భరోసా..
నా భర్త రమేశ్ ఫొటోగ్రాఫర్గా పనిచేస్తాడు. నేను కూడా బట్టల దుకాణంలో పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాం. ఇటీవలే మా కూతురు రచన పెళ్లి చేశాం. పెళ్లి కోసం కొంత అప్పు చేశాం. కల్యాణ లక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నాం. రాష్ట్ర సర్కారు రూ.1,00,116లు అందించింది. ఈ డబ్బులతో అప్పు తీర్చాం. ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసేందుకు ఇబ్బంది పడే ఈ రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఆర్థిక సాయం అందించడం మరచిపోలేం.
– గోదస్తు పూనమ్, ఈద్గాం, నిర్మల్
పేదల దేవుడు కేసీఆర్ సారు..
మాలాంటి పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారు దేవుడి లాంటివారు. నాకు కొడుకు, కూతురు. మా భర్త కూలి పని చేస్తుండే. ఎనిమిదేళ్ల క్రితం ఆనారోగ్యంతో చనిపోయాడు. నేను బీడీలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. చాలా కష్టపడి మా కూతురు ఇంద్రజ పెళ్లి చేసినం. కొడుకు కూలీ పనులకు వెళ్తూ ఇంటికి ఆసరా అయితున్నడు. కష్ట కాలంలో మాకు కల్యాణలక్ష్మి డబ్బులు అందినయ్. చాలా సంతోషంగా ఉంది.
నేళ్ల వినోద, వెంకటాద్రిపేట్, నిర్మల్
ఆర్థిక భారం కాకూడదనే
ఆడ పిల్లల పెళ్లిల్ల వ్యవహారం వారి తల్లి దండ్రులకు భారం కావద్దనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకాలు అమలు కావడం లేదు. ఈ పథకం అమలులో పూర్తి పారదర్శకత పాటిస్తూ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమవుతున్నాయి. దళారుల ప్రమేయానికి అవకాశం లేకుండా పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాతనే లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నారు.
అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి
కేసీఆర్ సారు మేలు మరువలేనిది..
పేద, మధ్య తరగతి కుటుంబాల్లో పెండ్లి చాలా కష్టంతో కూడుకున్న కార్యం. నేను, నా భర్త గురుశరణం ఇద్దరమూ ఓ ప్రైవేటు పాఠశాలలో స్వీపర్లుగా పని చేస్తూ జీవిస్తున్నం. పొట్ట గడవడమే కష్టమైన పరిస్థితిలో కూతురు సంగీత పెండ్లి చేయడానికి అనేక ఇబ్బందులు పడ్డాం. తెలిసిన వారితో పాటు బంధువుల దగ్గర అప్పులు చేయాల్సి వచ్చింది. మా కుటుంబానికి కల్యాణలక్ష్మి పథకం కింద రూ. లక్షా 116ల సాయం చేసి ఆదుకున్నరు. కేసీఆర్ సారు మేలు మరువలేనిది.
మాదాసు పద్మ, గాంధీచౌక్, నిర్మల్
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం..
నాకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. ఈ మధ్యనే చిన్న కూతురు మాధవి పెళ్లి చేసిన. కల్యాణలక్ష్మి సాయం అందింది. భర్త లేని నా లాంటి అభాగ్యురాలికి సీఎం కేసీఆర్ సారే పెద్ద దిక్కయిండు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటం. 10 ఏండ్ల కింద మా పెద్ద కూతురు మౌనిక పెండ్లి చేసిన. అప్పటి ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలే. పేదోళ్ల ఇళ్లల్లో పెండ్లిల్ల ఖర్చుల గురించి ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ సారే.. ఆయనను గుండెల్లో పెట్టుకుంటం.
ఎన్. రుక్మా, బ్రహ్మపురి, నిర్మల్