ఎదులాపురం, ఆగస్టు 8 : జిల్లాలోని బీసీ కులవృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని బుధవారం నుంచి పంపిణి చేస్తామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ కులవృత్తుల వారికి ఆర్థికసాయం చెక్కుల పంపిణీ కార్యక్రమంపై మంగళవారం ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 14 బీసీ కులవృత్తుల వారికి రూ.లక్ష ఆర్థికసాయం చెక్కులను నియోజకవర్గ కేంద్రాల్లో స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో అందజేస్తామని తెలిపారు.
నియోజక వర్గానికి 300 మంది లబ్ధిదారుల చొప్పున బోథ్ నియోజకవర్గంలోని 9 మండలాలకు చెందిన లబ్ధిదారులకు బుధవారం, ఆదిలాబాద్ నియోజకర్గంలోని లబ్ధిదారులకు గురువారం స్థానిక నియోజకవర్గ కేంద్రాల్లో పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. మండలాల వారీగా లబ్ధిదారుల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం ఎన్నికల సెక్టోరల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వారికి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఖుష్బూగుప్తా, శ్యామలాదేవి, జడ్పీసీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, డీఈవో ప్రణీత, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ, ఎంపీడీవోలు,సెక్టోరల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.