ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 24: ఆదిలాబాద్ పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నది. దీనికితోడు గృహాల సంఖ్య పెరుగుతున్నది. ఈ క్రమంలో ప్రతిరోజూ టన్నుల కొద్దీ చెత్త ఉత్పత్తి అవుతున్నది. దీన్ని మున్సిపల్ అధికారులు ప్రత్యేక వాహనాల ద్వారా బంగారుగూడలోని డంప్ యార్డుకు తరలిస్తున్నారు. ఇక్కడ చెత్తను వేరుచేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు లేవు. దీంతో చెత్త పేరుకుపోతున్నది. ఈ క్రమంలో మున్సిపల్ పాలకవర్గం చెత్త నుంచి ఎరువుల తయారీ కోసం ప్రత్యేకంగా డీఆర్సీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకోసం పట్టణ శివారులోని బంగారుగూడలో డీఆర్సీ (డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్)ని ఏర్పాటు చేశారు. సుమారు రూ.కోటితో నిర్మించారు.
రోజూ 72 మెట్రిక్ టన్నుల చెత్త..
పట్టణంలో ప్రతిరోజూ సుమారు 72 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని మున్సిపల్ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువులు తయారు చేసే పరిస్థితి ఉండేది కాదు. కానీ డీఆర్సీ ఏర్పాటు చేయడంతో త్వరలోనే చెత్త నుంచి ఎరువులను తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందులో తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువులను తయారు చేరసేందకు వర్మీ కంపోస్టు యూనిట్ను నిర్మించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, పాలిథిన్ కవర్లు, సీసాలు, అట్టముక్కలు, గాజు పదార్థాలు, ఇనుము తదితర ఘన వ్యర్థాలను వేరు చేసి పునరుత్పత్తికి తరలించేందుకు మరో కేంద్రాన్ని నిర్మించారు. వాహనంలో తీసుకొచ్చిన చెత్తను తూకం వేసేందుకు ఓ యంత్రాన్ని సైతం ఏర్పాటు చేశారు.
మహిళా సమాఖ్యకు బాధ్యతలు..
తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసే బాధ్యతను మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. ఎరువులను నర్సరీలు, మొక్కల ఎదుగుదలకు ఉపయోగిస్తారు. ఘన వ్యర్థాల నిర్వహణ బాధ్యతలను మెప్మా ఆధ్వర్యంలోని మహిళా సమాఖ్యకు అప్పగించనున్నారు. వారే సిబ్బందిని నియమించుకొని వేరు చేసిన వ్యర్థాలను అవసరమైన వ్యాపారులకు విక్రయించనున్నారు. ఈ విధానంపై అవగాహన కోసం మెప్మా అధికారులు మహిళా సంఘాల సభ్యులను సిద్దిపేటకు తీసుకెళ్లారు. అక్కడ ఘన వ్యర్థాల నిర్వహణ తీరుతెన్నులను తెలుసుకున్నారు. రోజూ వచ్చే చెత్తతో సంఘానికి ఆర్థిక లాభం చేకూరనున్నది.
స్వచ్ఛ ఆదిలాబాద్ లక్ష్యంగా..
స్వచ్ఛ ఆదిలాబాద్ దిశగా ప్రణాళికలు రూపొందించాం. పట్టణంలో ఎక్కడా చెత్తా చెదారం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. సేకరించిన చెత్త నుంచి ఆధాయం పొందేందుకు డీఆర్సీని ఏర్పాటు చేశాం. త్వరలోనే దీన్ని ప్రారంభిస్తాం. పట్టణ వాసుల నుంచి సేకరించిన చెత్తను ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తే ఎరువులను తయారు చేయనున్నాం. ప్రజలు కూడా తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాల్లో వేస్తే పని మరింత సులువవుతుంది.
– జోగు ప్రేమేందర్, మున్సిపల్ చైర్మన్, ఆదిలాబాద్