సిర్పూర్(టీ), డిసెంబర్ 28 : సిర్పూర్(టీ) అటవీశాఖ రేంజ్ పరిధిలోని చింతకుంట గ్రామ సమీపంలో విద్యుత్ తీగలు అమర్చి రెండు చుక్కల దుప్పులను హతమార్చిన 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు కాగజ్నగర్ ఎఫ్డీవో వేణుబాబు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 23న చింతకుంట అటవీ ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన కొందరు విద్యుత్ తీగలు అమర్చి రెండు చుక్కల దుప్పులను హతమార్చారు.
సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విచారణ చేపట్టి మొత్తం 31 మందిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 28న 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో 16 మంది పరారీలో ఉన్నారు. అటవీ జంతువులను వేటాడినా, పంట పొలాల చుట్టూ విద్యుత్ కంచెలు అమర్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్(టీ) అటవీ శాఖ రేంజ్ అధికారి పూర్ణచందర్ రావు, డీఆర్వో ముసావీర్, ఎఫ్ఎస్వోలు సద్దాం, పోశెట్టి, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.