ఇచ్చోడ(సిరికొండ), ఏప్రిల్ 14 : బావిలో పడిన తండ్రిని కాపాడబోయిన కొడుకూ మృతి చెందిన సంఘటన సిరికొండ మండలంలో పొచ్చంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్ఐ నీరేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పొచ్చంపల్లి గ్రామానికి చెందిన రైతు మడావి సోనేరావ్(50) తన పొలంలో ఇటీవల కొత్తగా బావి తవ్వించాడు. శుక్రవారం ఉదయం సోనేరావ్ కూతురు శైలజతో కలిసి కొత్తబావికి పూజ చేయడానికి వెళ్లారు. పూజ చేసేందుకు ముంతతో నీళ్లు తీసుకురావడానికి బావిలో దిగుతుండగా, కాలు జారి అందులో పడ్డాడు. ఇది చూసిన కూతురు శైలజ ఇంటికి వచ్చి అన్నయ్య సూర్యభాన్ (24)కు చెప్పడంతో అతను బావి దగ్గరికి వెళ్లి తండ్రిని రక్షించేందుకు బావిలో దూకాడు. అతనికి ఈత రాకపోవడంతో తండ్రితోపాటు బావిలో మునిగాడు.
శైలజ మళ్లీ గ్రామానికి వచ్చి తండ్రి, అన్నయ్య బావిలో పడ్డారని స్థానికులకు చెప్పడంతో వారు అక్కడికి చేరుకొని రక్షించేందుకు యత్నించారు. కానీ అప్పటికే వారిద్దరూ మృతి చెందారు. గ్రామ పెద్దల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం బోథ్ దవాఖానకు తరలించారు. సోనేరావ్కు భార్య, ముగ్గురు కొడుకులు, ముగ్గులు కూతుళ్లు ఉన్నారు. సూర్యభాన్కు పెళ్లికాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్ఐ నీరేశ్ తెలిపారు.