బోథ్/ఇచ్చోడ/ఇంద్రవెల్లి, జూన్ 8 ః బోథ్ మార్కెట్ యార్డుకు జొన్నలు అమ్మకానికి తెచ్చిన రైతులు ఆగమయ్యారు. సోమవారం సుమారు అరగంటపాటు కురిసిన వర్షంతో యార్డులో నీళ్లు నిలవడంతో ఇబ్బందులు పడ్డారు. పలువురి రైతులకు చెందిన జొన్న బస్తాలు వర్షానికి తడిసి పోయాయి. టార్పాలిన్లపై ఆగిన నీటిని తొలగించేందుకు, కుప్పల మధ్య నిలిచిన నీటిని తోడేందుకు రైతులు పాట్లు పడ్డారు. జొన్నలు తూకం వేయడం పూర్తయిన, గోదాములకు తరలించడం ఆలస్యం అవుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 27 వేల బస్తాలు గోదాంలకు తరలించాల్సి ఉందని సహకార సంఘం సీఈవో భూషణ్ తెలిపారు.

సిరికొండలో..
సిరికొండ మండల కేంద్రంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. మండలంలోని పొన్న, సిరికొండ ఆయా గ్రామాలకు చెందిన రైతుల కుప్పలు ఉన్నాయి. మార్కెట్ యార్డు లేకపోవడంతో వర్షానికి జొన్న తడిచిపోతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మండల కేంద్రంలోనే మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. సిరికొండ మండల సొసైటీ డైరెక్టర్ రాజన్న మార్కెట్ యార్డును సందర్శించారు. త్వరగా కొనుగోలు పూర్తి చేయాలని కోరారు.
ఇంద్రవెల్లి మండలంలో..
ఇంద్రవెల్లి మండలంలోని గౌరాపూర్, తేజాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సాలేగూడ, దోభిగూడ, మోహన్గూడ, మోహన్సింగ్తండాల్లో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సాలేగూడ గ్రామ సమీపంలో గల త్రీఫేజ్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తోపాటు విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. ఇండ్ల పైకప్పులు, రేకులు ఎగిరిపోయాయి. నిత్యావసర సరుకులు, వస్తువులు తడిశాయి.


