కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : నాలుగు రోజులుగా పత్తి కొనుగోళ్లు చేపట్టకపోవడంపై రైతులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. రైతులు మాట్లాడుతూ జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్నాయని, వాటి చార్జీల భారం తమపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సీసీఐ స్పందించి ఎప్పటికప్పుడు కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దుర్గం దినకర్ మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పత్తిని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నదన్నారు. జిన్నింగ్ మిల్లులో రోజుకు 1500 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, ఆ నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతులతో కలిసి అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందించారు.
సర్వస్ సమస్య వల్లే కొనుగోలు చేయడం లేదు
సర్వర్ సమస్య కారణంగానే పత్తి కొనుగోళ్లు రెండు రోజులుగా నిలిచిపోయినట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి అశ్వక్ హైమద్ తెలిపారు. పత్తి కొనుగోళ్లలో ఆధార్ ప్రామాణికత ముఖ్యమైందని, అయితే సర్వర్ సమస్యల కారణంగా పత్తి రైతులు తీసుకువచ్చే ఆధార్ అథెంటికేషన్ కావడం లేదన్నారు. సర్వర్ సమస్య తీరిన వెంటనే కొనుగోళ్లు ప్రారంభిస్తామని తెలిపా రు. కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించే వరకూ రై తులు పత్తిని తీసుకురావద్దని సూచించారు.
రెండు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
కౌటాల, ఫిబ్రవరి 11 : మండల కేంద్రంలోని శ్రీ వైష్ణవీ మాత కాటన్ ఇండస్ట్రీస్లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. సోమవారం నుంచి సర్వర్ సమస్యతో పత్తి కొనుగోళ్లకు బ్రేక్ పడగా, మిల్లు వద్ద రెండు కిలోమీటర్ల మేర పత్తి వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు, డ్రైవర్ల కిరాయి భారం తమపై పడుతుందని, వెంటనే పత్తి కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, కొందరు గత్యంతరం లేక ఎంతో కొంతకు ప్రైవేట్ వ్యాపారులకు పత్తిని అమ్ముకొని వెనుదిరుగుతున్నారు.
కిష్టంపేటలో రోడ్డెక్కిన కర్షకులు
చెన్నూర్ రూరల్, ఫిబ్రవరి 11: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామ సమీపంలోని వరలక్ష్మీ జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారం చెన్నూర్-మంచిర్యాల ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. మూడు రోజులుగా పత్తి వాహనాలతో ఇక్కడే ఉండాల్సి వస్తున్నదని, సీసీఐ అధికారులు ఆన్లైన్ పని చేయడం లేదంటూ నిర్లక్ష్యపు సమాధానమిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. మాజీ ఎంపీపీ మంత్రి బాపు మాట్లాడుతూ దళారులు-సీసీఐ అధికారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని, నిత్యం రోడ్డెక్కాల్సి వస్తున్నదని, ఈ విషయమై ఉన్నధికారులు స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి రెండు గంటల పాటు ధర్నా చేయడంతో రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మార్కెట్ సెక్రటరీ రామాంజనేయులు, పట్టణ సీఐ రవీందర్, ఎస్ఐ సుబ్బారావు, సీపీవో అక్కడికి చేరుకొని ఆన్లైన్ రాగానే పత్తి కొనుగోళ్లు చేపడుతామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. చెన్నూర్ మాజీ కౌన్సిలర్ మహేశ్, కిష్టంపేట సర్పంచ్ బుర్ర రాకేశ్ గౌడ్ పాల్గొన్నారు.