సారంగాపూర్, మే 19 : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మార్కెట్ యార్డు వద్ద స్వర్ణ-నిర్మల్ రహదారిపై జొన్నలు కొనుగోలు చేయాలని మంగళవారం రైతులు ధర్నా నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. తహసీల్దార్ విజయ్కాంత్రావుకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. తహసీల్దార్ కలెక్టర్ భవేశ్మిశ్ర దృష్టికి తీసుకువెళ్లి రెండు రోజుల్లో జొన్నలు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సారంగాపూర్ మార్కెట్ యార్డులో జొన్నలు పోసి నెల రోజులు గడుస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి 20 రోజుల క్రితం ప్రారంభించారని, అప్పటి ఇప్పటివరకు గన్నీ బ్యాగులు లేక ఒక గింజా కూడా కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణంలో మార్పుల వల్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండడంతో జొన్నలు తడసి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.