ఆదిలాబాద్, జూన్ 18(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని వానకాలం ఆందోళనకు గురి చేస్తున్నది. సీజన్ ప్రారంభమై పక్షం రోజులు దాటినా చినుకు జాడలేక పోవడంతో వరుణుడి కరుణ కోసం ఎదురు చూడాల్సి వస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 4.26 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఏటా జూన్ మొదటి వారంలో వర్షాలు పడుతుండగా.. ఈ సంవత్సరం చాలా మంది పత్తి విత్తనాలు వేశారు. వానలు పడి విత్తనాలు మొలకెత్తుతాయని ఆశించినా లాభం లేదు. దీంతో రైతులు వర్షాలు ఎప్పుడు పడుతాయని ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఈ సమయానికి వర్షాలు పడగా.. పత్తి విత్తనాలు మొలకెత్తాయి. ఈనెల చివరి వరకు పత్తి విత్తనాలు వేసుకునే అవకాశం ఉందని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గతేడాది అధిక వర్షాల కారణంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది వానలు లేక పంటలు వేయలేని పరిస్థితి నెలకొన్నది.
కొనసాగుతున్న ఎండల తీవ్రత
ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ఎండకాలాన్ని తలపిస్తున్నది. 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వానకాలంలో సాధారణ వర్షపాతం 1100 మిల్లీ మీటర్లు. గురువారం వరకు 103.5 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, 37 మిల్లీ మీటర్ల వర్షం పడింది. నల్లరేగిడి నెలల్లో 60 నుంచి 75.. చెలక భూముల్లో 60 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైతే పత్తి విత్తనాలు వేసుకొనే అవకాశం ఉంటుంది.
కానీ.. జిల్లాలోని ఏ మండలంలో కూడా ఆ మేరకు వర్షపాతం నమోదు కాలేదు. వర్షాలు లేక పత్తి సాగు ఆలస్యమైతే.. సోయా, మక్క, కంది, ఇతర పంటలు ఎప్పుడు వేయాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం యాసంగి పంటకు సంబంధించి కేవలం రెండెకరాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ చేయగా, వానకాలం సీజన్ ప్రారంభమైన రైతు భరోసా విడుదలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. యాసంగిలో రైతులు పండించిన జొన్న పైసలు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. దీంతో రైతులు సాగు కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. వర్షాల వల్ల సాగు చేయకపోతే అన్నదాతలపై అప్పుల భారం పెరుగుతుంది.
వాన కోసం చూస్తున్నాం..
నాకు తొమ్మిదెకరాల వ్యవసాయ భూమి ఉంది. జూన్ మొదటి వారంలో వర్షం పడడంతో ఆరు బ్యాగుల పత్తి, ఆరు బ్యాగుల మక్క విత్తనాలు వేసిన. ఆరు రోజులు అవుతున్నా వర్షం జాడ లేదు. ఇందుకు రూ.60 వేల ఖర్చు చేసిన. వర్షం కోసం రోజు ఎదురు చూస్తున్న. గతేడాది అధిక వర్షాలతో పంట నష్టపోయా. ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడంతో పత్తి సాగు కష్టంగా మారింది. ఈ వర్షాకాలం ఎండాకాలం మాదిరి ఉంది. వారం రోజుల్లో వర్షాలు పడకపోతే విత్తనాలు నష్టపోవాల్సి వస్తది. రెండోసారి విత్తనాలు కొనుగోలు చేసి వేయాల్సి వస్తుంది.
– లాల్షావ్, రైతు, ఇంద్రవెల్లి