నార్నూర్ : భూ సమస్యను తక్షణమే పరిష్కరించాలని అఖిల భారతీయ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కుట్ల శంకర్, జిల్లా కార్యదర్శి చిలుకా దేవిదాస్ డిమాండ్ చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ ( Narnoor Mandal) మండల కేంద్రంలో వారు మాట్లాడారు. మహాగావ్ శివారులో 70 ఏళ్లుగా ఎస్సీ రైతులు భూమిని సాగు చేసుకుంటున్నారని వివరించారు. అదే గ్రామానికి చెందిన రాథోడ్ హరిచంద్ ఎస్సీల భూమిని దున్ని పంట సాగు చేస్తున్నట్లు మండిపడ్డారు.
రాథోడ్ హరిచంద్ పై రైతులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆదేశాలను బేఖాతర్ చేసి పంట సాగు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. భూ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని రెవెన్యూ, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, ఎస్సీ రైతులకు న్యాయం జరగకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు దుర్గే గుణవంత్ రావ్, యశోద బాయి, దుర్గే లీలాబాయి, దుర్గే పురుషోత్తం, జాడే నాగోరావ్, రమాకాంత్, సమతా సైనిక్ దళ్ సభ్యులు ఉన్నారు.