నిర్మల్ టౌన్, డిసెంబర్ 16: నిర్మల్ జిల్లాలో పాత పంటల వైపు రైతులు మళ్లీ దృష్టిసారించారు. వాణిజ్య పంటల్లో మేలు రకాలైన మిర్చి సాగు వైపు ఆసక్తి చూపడంతో మిర్చి గణనీయంగా పెరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. నిర్మల్ జిల్లాలో పదేళ్ల క్రితం మిర్చి సాగు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇవ్వడం, భూగర్భజలాలు సమృద్ధిగా ఉండడంతో పత్తి, మక్క, వేరుశనగ, పసుపు వంటి పంటలకు ప్రాధాన్యతనిచ్చారు. ఆ పంటలకు మార్కెట్లో ధర లేకపోవ డం, దిగుబడులపై కూడా ప్రభావం చూపడంతో పంట మార్పిడిపై దృష్టి సారించారు. ఖరీఫ్ సీజన్లో మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న మిర్చికే అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సాగు చేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో ఈ ఖరీఫ్లో మిరప సాగు గణనీయంగా పెరిగింది. గతేడాది వరకు 200 ఎకరాల్లోపే సాగు కాగా ఈ సంవత్సరం 2 వేల ఎకరాలకు పెరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో నల్లరేగడి భూములు, భూగర్భజలాలు అధికంగా ఉండడంతో రైతులు మిర్చి పంటకు ప్రాధాన్యతనిస్తున్నారు. పంట కాలం 210 రోజులు కావడంతో 140 రోజుల నుంచే కాపు కాసి ఐదు సార్లు కాపు కాయడంతో ఎకరానికి 20-25 క్వింటాళ్ల దిగుబడి వస్తోందని పేర్కొంటున్నారు. మార్కెట్లో క్వింటాలుకు 14 వేలకు పైగానే ధర పలుకుతోంది.
పచ్చి మిర్చి కూడా రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు ధర పలకడంతో రైతులు పంట చేతికొచ్చినప్పటి నుంచి అయిపోయే వరకు నాలుగు సార్లు కాయలు కాయడంతో రైతులు లాభాలను గడిస్తున్నారు. ఇతర పంటలతో పోల్చితే పెట్టుబబడికి అధికమైనప్పటికీ మిర్చి పంట పండితే తమ కష్టాలు దూరమవుతాయని సాగు చేస్తున్నట్లు రైతులు తెలుపుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు కూడా మిర్చిపై వివిధ తెగుళ్ల నివారణకు విస్తృతంగా అవగాహన కల్పిస్తూ దిగుబడులు పెరిగేలా రైతులకు సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు.