భైంసాటౌన్, జనవరి 8 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నదాతపై మరో భారం మోపింది. తాజాగా మక్కజొన్న విత్తన సంచులపై మరింత భారాన్ని మోపడం ద్వారా రైతుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్ర సర్కారు అనాలోచితమైన నిర్ణయంతో సాగు దారులు అడుగడుగునా అవస్థలు పడుతున్నారు. డీజిల్ ధరలను రూ. 100 దాటించడం ద్వారా రెండేళ్ల నుంచి సాగు ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. విత్తనాలు, ఎరువుల విషయంలో ప్రతీ సీజన్కు ముందు ఏదో ఒక రూపంలో మోదీ సర్కారు ఉపద్రవం తీసుకు వస్తున్నది. ఇప్పుడు మక్కజొన్న రూపం లో నాలుగు కిలోల సంచికి రూ. 300 చొప్పున అదనపు భారాన్ని కేంద్ర ప్రభుత్వం మోపింది.
సాధారణంగా వానకాలం నష్టాలను భర్తీ చేసుకునేందుకు రైతులు యాసంగిలో మక్కజొన్న సాగుకు ప్రాధాన్యమిస్తారు. ఈసారి మక్కల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తుండగా విత్తన కంపెనీలు ధరలను అమాంతం పెంచాయి. రైతులు అధికంగా వినియోగించే కొన్ని సంస్థల విత్తనాలు దొరకడం కష్టమేనంటూ ప్రచా రం చేస్తున్నారు. దీంతో రైతులు ముందుగానే పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే దుక్కి, కూలీల ఖర్చులు పెరిగి పెట్టుబడి భారంగా మారిన సమయంలో విత్తన ధరల పెంపుతో రైతు నెత్తిన పిడుగు పడినట్లు అవుతున్నది. గతేడాది 4 కిలోల సంచి ధర రూ. 1200 లు ఉండగా ప్రస్తుతం రూ. 1500ల వరకు పెరిగింది. అన్ని సంస్థల విత్తన ధరలు కూడా ఇదే విధంగా ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎకరాకు విత్తన ఖర్చు రూ. వెయ్యి వరకు పెరిగినట్లయ్యింది.
దేశ రైతాంగానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శాపంగా దాపురించింది. మక్కజొన్న సాగు చేస్తున్న వారిని కేంద్ర ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తున్నది. అందివచ్చిన లాభాలను లాగేసుకునేలా చర్యలకు ఎగబడుతున్నది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మక్కజొన్నకు భారీ డిమాండ్ ఉంది. దీంతో లాభాలు వస్తాయని రైతులు భావిస్తున్న తరుణంలో కేంద్ర సర్కారు మరోసారి ధరల రూపంలో ప్రతాపం చూపుతున్నది. డిమాండ్ భారీగా ఉండడంతో విదేశాలకు మక్కజొన్న ఎగుమతులు పెరిగాయి. దీంతో ప్రస్తుతం మక్క క్వింటాలుకు రూ. 2 వేల నుంచి రూ. 2500ల వరకు పలుకుతున్నది. ఇలాంటి సమయంలో ఎగుమతులను నిషేధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే మక్కజొన్న ధర పడిపోయి రైతుకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. రైతుల పొట్ట కొట్టి కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకే కేంద్రం ఇలాంటి చర్యలకు దిగుతున్నదని రైతులు ఆరోపిస్తున్నారు.
భైంసా మండలంలో ఈ యాసంగిలో మక్కజొన్న 15 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు ఏవో రాంచందర్ నాయక్ తెలిపారు. గతేడాది కంటే 25 శాతం మక్కజొన్న సాగు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇంకా 4 వేల నుంచి 5 వేల ఎకరాల వరకు మక్క సాగు పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 2020 జూన్లో డీజిల్ ధర రూ. 69 ఉండగా ఇప్పుడు రూ. 100 దాటింది. ఇంతటి పెనుభారంతో వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి. వరి సాగు చేసే రైతుపై ఏడాదికి ఎకరాకు అదనంగా రూ. 3 వేల నుంచి రూ. 3500ల వరకు ఖర్చు అవుతున్నది. ఈ పాపానికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమే ప్రధాన కారణం.
కేంద్ర ప్రభుత్వం మక్కజొన్న విత్తన ధరలు పెంచడం బాధాకరం. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకుండా విత్తన ధరలను పెంచడంతో రైతులకు పెనుభారంగా మారుతున్నది. రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం రైతుల మేలుకు ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుండగా కేంద్రం మాత్రం అన్ని రకాలుగా రైతులకు నష్టం కలుగజేస్తున్నది.
(లక్ష్మణ్, రైతు, దేగాం)
రైతు ప్రభుత్వమని చెప్పుకునే కేంద్రం మక్కజొన్న విత్తనాల ధరలను పెంచడంతో అదనపు భారం పడుతున్నది. రైతులను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం విత్తనాల ధరలను పెంచి ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఇది సరిపోదన్నట్టుగా విదేశాలకు ఎగుమతులను నిషేధించాలనుకోవడం బాధాకరం. కేంద్రం ఇంధన ధరలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి.
(రాంకుమార్, రైతు, వానల్పాడ్)