ఆదిలాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. 46.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బజార్హత్నూర్ మండలంలో అత్యధికంగా 63.8 మిల్లీ మీటర్లు, ఇచ్చోడలో 63.7, గుడిహత్నూర్లో 63.2, నేరడిగొండలో 58.7, బోథ్లో 47.5, ఆదిలాబాద్ రూరల్లో 56.4, సిరికొండలో 49.5, తాంసిలో 48.3, ఉట్నూర్లో 47.5, తలమడుగులో 45.8, భీంపూర్లో 39.5 మిల్లీ మీటర్ల వాన పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మోస్తరుగా కురిసింది. జిల్లాలో ఈ సీజన్లో ఇప్పటి వరకు 723.1 మిల్లీ మీటర్ల వర్షపాతం న మోదు కావాల్సి ఉండగా, 863.3 మిల్లీ మీటర్ల వ ర్షం పడింది. పలు చోట్ల వాగులు పొంగి ప్రవహించాయి. చెరువులు, ప్రాజెక్టుల్లోకి వరదనీరు చేరింది. జిల్లాలో 20 రోజులుగా వర్షం లేకపోవడంతో రై తుల్లో ఆందోళన నెలకొన్నది. పత్తి, సోయాబిన్, పం టల ఎదుగుదలకు నీరు అవసరమవగా, శనివారం కురిసిన వర్షంతో పంటలకు ఎంతో ఉపయోగపడుతుందని రైతులు అంటున్నారు. జిల్లాకు వర్షసూచన నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
వడ్డాడి మత్తడికి వరద..
తాంసి, ఆగస్టు 19 : మహారాష్ట్ర, ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తాంసి మండలంలోని వడ్డాడి మత్తడి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టును ఏఈ హరీశ్కుమార్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఒక గేటు ఎత్తినట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల్లో చేపలుపట్టే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రాజెక్టుకు 1200 క్యుసెక్కుల వరద వస్తుండడంతో ఔట్ ఫ్లోగా 1674 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 277.50 (0.570 టీఎంసీలు)మీటర్లు కాగా ప్రస్తుతం 276.70 మీటర్లు(0.469)గా ఉంది.
నిండు కుండలా కడెం..
కడెం, ఆగస్టు 19 : నిర్మల్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతున్నది. జలాశయం పూర్తిస్థాయి సామార్థ్యం 700 అడుగులు (7.603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 691.150 అడుగులు (5.502టీఎంసీల) వద్ద కొనసాగుతున్నది. కాగా, ప్రాజెక్టులోకి 29,998 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతున్నది. అయితే అధికారులు ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచుతూ కుడి(6 క్యూసెక్కులు), ఎడమ (798 క్యూసెక్కులు)కాలువల ద్వారా దిగువకు వదులుతున్నారు.
‘స్వర్ణ’ రెండు గేట్లు ఎత్తివేత..
సారంగాపూర్, ఆగస్టు 19 : సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. మహారాష్ట్రలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇన్ఫ్లో పెరిగింది. ప్రాజెక్టు నీటిమట్టం 1183 అడుగులు (1.484 టీఎంసీలు)కాగా, 1179.8 అడుగుల(1.153 టీఎంసీలు)కు చేరింది. కాగా, శనివారం అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 7వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా, వచ్చిన నీటిని వచ్చినట్లుగా గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల ప్రజలు, గొర్రెలు, మేకలు, పశువుల కాపరులు అటువైపు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
గడ్డెన్న వాగు ప్రాజెక్టు ఒక గేటు..
భైంసా, ఆగస్టు 19 : భైంసా పట్టణంలో వర్షం కురిసింది. దీంతో మురుగు కాలువలు రోడ్లపై నుంచి ప్రవహించాయి. మహారాష్ట్ర నుంచి గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతున్నది. 3,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. కాగా, అధికారులు ఒక గేటు ఎత్తి 6,838 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.