హాజీపూర్, నవంబర్ 25 : ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టరేట్ ఎదురుగా గురువారం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో గ్రూపు రాజకీయాలు బహిర్గతమయ్యాయి. ధర్నా అనంతరం వినతి పత్రం ఇచ్చేందుకు మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు (పీఎస్ఆర్) వర్గం నాయకులు రాష్ట్ర కార్యదర్శి బండి ప్రభాకర్, జిల్లా అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు పెంట రజిత, లక్షెట్టిపేట జడ్పీటీసీ ముత్తె సత్తయ్యతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు కార్యాలయంలోకి వెళ్లారు. అంతలోనే ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్, రాజ్యసభ సభ్యుడు హన్మంతరావు, కాంగ్రెస్ నాయకులు రాములు నాయక్ సైతం కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రేంసాగర్ రావు వర్గానికి చెందిన నాయకులు గో బ్యాక్ వీహెచ్, జనక్ ప్రసాద్, వినోద్, కేవీ ప్రతాప్ గో బ్యాక్ అంటు నినాదాలు చేశారు. వీహెచ్ వాహనాన్ని అడ్డుకోవడంతో ఆయన వాహనం దిగి రోడ్డుపై బైఠాయించారు. ఒకరిపై ఒకరు గో బ్యాక్ అంటూ నినదించడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసుల జోక్యంతో శాంతించారు. అనంతరం వీహెచ్, జనక్ ప్రసాద్ వర్గం కలెక్టరేట్ పరిపాలనాధికారికి వినతి పత్రం ఇచ్చారు.
భగ్గుమన్న గ్రూపు విబేధాలు
వరిధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్వంలో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రాలను ఇవ్వాలని అధిష్టానం ఆదేశాల మేరకు చేపట్టిన కార్యక్రమంలో పార్టీలోని వర్గ పోరు బహిర్గతమైంది. ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాల నాయకులు గో బ్యాక్ అంటూ నినదించుకోవడంతో జిల్లాలో పార్టీ తీరు చర్చనీయాంశంగా మారింది.
వినతి పత్రం ఇచ్చేందుకు పోటాపోటీ
కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చేందుకు ఇరువర్గాల నాయకులు పోటీ పడ్డారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి ఎన్నికైనప్పటి నుంచి ప్రేం సాగర్ రావు, కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం దక్కడం లే దంటూ 10 రోజల క్రితం అధిష్టానికి అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకోవడంతో జిల్లాలో కాంగ్రెస్ కనుమరుగు కానున్నదా..? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.