మంచిర్యాల, జూలై 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా..ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతమైంది. మసకబారిన కండ్లలో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ జనవరి 18వ తేదీన మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా.. కంటి సమస్యలు ఉండి, ఆర్థిక స్థోమతలేని వారికి వరంగా మారింది. మొదటి విడుత విజయవంతం కాగా.. రెండో విడుత కూడా దిగ్విజయంగా పూర్తయింది. గ్రామాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించారు. కంటి సమస్యలు ఉన్న వారిని పరీక్షించి ఉచితంగా మందులు, కండ్లద్దాలు అందించారు. 90 శాతం మందికి అద్దాలు పంపిణీ చేయగా.. మిగతా 10 శాతం మందికి త్వరలో అందిస్తామని అధికారులు తెలిపారు. సీఎం కేసీఆర్ సారు మా జీవితాల్లో వెలుగులు నింపారని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
‘కంటి చూపు మందగించి.. తమ పని తాము చేసుకోలేక ఇబ్బందులు పడుతూ.. కండ్లు సరిగా కనిపించకున్నా నెట్టుకొస్తున్న వృద్ధులు.. చిన్నతనం నుంచే ఫోన్లు, టీవీలు చూసి దృష్టి లోపంతో పుస్తకాలు చదవలేని పిల్లలు.. ఏ ఇంటికి వెళ్లినా కనిపించే దృశ్యాలు. కానీ.. కేసీఆర్ సీఎం అయ్యాక తన దత్తత గ్రామమైన ఎర్రవెల్లిలో నిర్వహించిన వైద్యశిబిరంలో వృద్ధులు, చిన్న పిల్లలతోపాటు చాలా మంది తమకు కంటి సమస్య ఉందని తెలుసుకోలేని దీనస్థితిలో ఉన్నట్లు గుర్తించారు. అప్పుడే రాష్ట్రంలో ఎంత మందికి సమస్య ఉందో గుర్తించి, వారందరికీ పరీక్షలు చేయించాలని నిర్ణయించుకున్నారు. అలా ఆయన ఆలోచనల నుంచి పుట్టిన ‘కంటి వెలుగు’ ఎందరో దృష్టి లోపాలను సరిదిద్దింది. కండ్లు సరిగా కనిపించక బాధ పడుతున్న చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడుత కంటి వెలుగులో భాగంగా 14.68 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. అవసరమైన వారికి కండ్లద్దాలు ఇచ్చింది. ఈ ఏడాది జనవరిలో రెండో విడుత కంటి వెలుగును ప్రారంభించి ఉమ్మడి జిల్లాలో 13.11 లక్షల మందికి పరీక్షలు చేశారు. ఇందులో 1,86,773 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశారు. మరో 1,82,892 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అవసమరని గుర్తించారు. వీరిలో 90 శాతం మందికి ఇప్పటికే అద్దాలు అందించగా, మరో 10 శాతం మందికి అద్దాలు రావాల్సి ఉంది.
పేదలకు వరం..
ప్రజలకు సేవ జేసుట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సారు తర్వాతనే ఎవరైనా. ఎక్కడలేని విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నడు. దేవునోలే ప్రజలను ఆదుకుంటున్నడు. మాది పేద కుటుంబం. నేను కొత్తపల్లి గ్రామ పంచాయతీలో మల్టీవర్కర్గా పని చేస్తా. నాకు చాలా రోజుల నుంచి కంటి సమస్యలు ఉండే. డబ్బులు లేక పరీక్ష చేయించుకోలే. గింతకు ముందు 2018 ఆగస్టులో ముఖ్యమంత్రి సారు ఏర్పాటు చేసిన కంటి వెలుగులో పరీక్షలు చేయించుకొని అద్దాలు తీసుకున్నా. అద్దాలు బాగా పని చేశాయి. నేను రోజు గ్రామ పంచాయతీ పనులు చేయడంతోపాటు ఇంటి వద్ద చిన్న చిన్న పనులు చేయడం వల్ల దగ్గర దూరం చూపులో మళ్లీ తేడా వచ్చింది. ముఖ్యమంత్రి సారు రెండో విడుత ఈ పథకం పెడ్తున్నడని తెలిసి మేము చాలా సంతోషపడ్డాం. నేను రెండో సారి ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న. డాక్టర్లు మంచిగా చూసి మందులు, అద్దాలు ఇచ్చారు. అద్దాలు పెట్టుకోవడంతో ఇప్పుడు అంతా మంచిగా కనిపిస్తున్నాయి. మాలాంటి పేదోళ్లకు వరం లాంటిది.
వంద శాతం పూర్తి చేశాం..
మంచిర్యాల జిల్లాలో కంటి వెలుగు పరీక్షలు 100 శాతం విజయవంతంగా పూర్తి చేశాం. నిర్దేశించిన గడుపులోపు అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లోని అన్ని వార్డులను కవర్ చేశాం. ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా కార్యక్రమాన్ని అమలు చేశాం. ప్రిస్క్రిప్షనరీ అద్దాలు మరో 3,600 మందికి అందించాలి. సాధ్యమైనంత త్వరగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. కంటి వెలుగును విజయవంతం చేసేందుకు సహకరించిన పంచాయతీరాజ్, మున్సిపల్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.
– సుబ్బారాయుడు, డీఎంహెచ్వో, మంచిర్యాల.
ఉచితంగా అద్దాలు ఇచ్చిన్రు..
దండేపల్లి, జూలై 5 : మాది దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామం. వయస్సు మీద పడడంతో కండ్లు సరిగ్గా కనబడక పోయేటివి. ప్రైవేటు దవాఖాన్ల చూపించుకుందామంటే డబ్బులు లేవు. కంటి జబ్బుతో చాలా ఏండ్లు బాధపడ్డా. ఇంతలోనే ఆశ కార్యకర్తలు వచ్చి మన ఊళ్లోని సర్కారు బడిలో క్యాంపు పెట్టినట్లు చెప్పిన్రు. డాక్టరుకు చూపించుకున్న. పైసా ఖర్చు లేకుండా డాక్టర్లు పరీక్షలు చేసి, రూ.2 వేల విలువ గల అద్దాలు ఇచ్చిన్రు. గత ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు తీసుకురాలేదు. సీఎం సారు పేదోళ్ల పట్ల దేవుడిగా మారిండు. కంటి వెలుగు పథకంతో పేదలకు దగ్గరైండు.
– పుట్టపాక శంకరయ్య, తాళ్లపేట(దండేపల్లి)