కోటపల్లి : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం అద్భుత కార్యక్రమమని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ శాసనమండలి సమావేశంలో తెలిపారు. ఏ దేశం చేయని అద్భుత కార్యక్రమం హరితహారంతో రాష్ట్రంలో అడవి విస్త్రీర్ణం పెరిగిందని పేర్కొన్నారు. చెట్లు లేక, వానలు కురియక గతంలో కరువు ఛాయలు కనిపించేవని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత కల్పించినప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ కూడా కరువుఛాయలు కనిపించడం లేదన్నారు.
అడవుల సంరక్షణ పై ముఖ్యమంత్రి కేసీఆర్, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు సత్పలిస్తున్నాయని ప్రశంసించారు. మంచిర్యాల జిల్లాలోని గూడెం సత్యనారాయణ స్వామి, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గంగాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి, బాసరలోని సరస్వతి ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు.
ఎమ్మెల్సీ ప్రశ్నకు దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమాదానం ఇస్తూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి వివరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ను ఏర్పాటు చేయాలని కోరారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లకు వేతనాలను పెంచినట్లు మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్లకు వేతనాలు పెంచాలని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోరారు.