అడవుల సంరక్షణే ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం దహెగాం మండలం లగ్గామ శివారు, చింతలమానేపల్లి మండల కేంద్రంలో తునికాకు కూలీలకు రాయల్టీ చెక్కులను ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కుతో కలిసి పంపిణీ చేశారు. ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ తునికాకు కూలీల అభ్యున్నతిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, ఇప్పటి వరకు 50 ఆకుల కట్టకు రూ. 2 చెల్లిస్తుండగా, ఈ యేడాది నుంచి రూ.3కు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నదన్నారు. పోడు భూముల సర్వే కొనసాగుతున్నదని, వచ్చే నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రాణహిత నదిపై ప్రాజెక్టు నిర్మించి కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల రైతాంగానికి సాగునీరందిచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
దహెగాం/పెంచికల్పేట్/చింతలమానేపల్లి, ఫిబ్రవరి 27 : అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం దహెగాం మండలం లగ్గామ శివారు, చింతలమానేపల్లి మండల కేంద్రంలో తునికాకు కూలీలకు రాయల్టీ చెక్కులను పంపిణీ చేశారు. ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ 2016 నుంచి 2021 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.200 కోట్లు మంజూరయ్యాయని, ఇందులో ఉమ్మడి జిల్లాకు రూ.35.40 కోట్ల బోనస్ వచ్చిందని, 2 లక్షల మంది లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. ఆసిఫాబాద్ జిల్లాకు రూ. 31 కోట్లు వచ్చాయని తెలిపారు. గిరివెల్లి యూనిట్కు రూ.7 కోట్లు, పెంచికల్పేట్కు రూ.6 కోట్ల రాయల్టీ నిధులు మంజూరయ్యాయన్నారు. తునికాకు కూలీల అభ్యున్నతిపై సర్కారు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నదని, ఇప్పటి వరకు 50 ఆకుల కట్టకు రూ. 2 చెల్లించగా, ఈ యేడాది నుంచి రూ. 3 చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మూసివేసే ప్రమాదమున్నందున పేదలు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో మన సీఎం తునికాకు కట్ట ధర పెంచేందుకు కార్యాచరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిర్పూర్, కాగజ్నగర్ మధ్య అటవీ ప్రాంతంలో రూ.5 కోట్లతో జింకలు, వన్యప్రాణులను పెంచే అర్బన్ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ప్రాణహిత నదిపై ప్రాజెక్టు నిర్మించి ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల రైతాంగానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోడు భూములకు సర్వే కొనసాగుతున్నదని, వచ్చే నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. త్వరలో రూ.19 కోట్లతో పెద్దవాగు అప్రోచ్రోడ్డు పనులు చేపడుతామని పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ ఒక్కో కుటుంబానికి రాయల్టీ సగటున రూ. 20వేల నుంచి రూ. 90 వేల వరకు అందుతుందని, తునికాకు కూలీల్లో సంతోషాన్ని చూస్తున్నామన్నారు. ఖర్జీ నుంచి మొట్లగూడ వరకు బీటీ రోడ్డు నిర్మించేందుకు అటవీశాఖ అనుమతులు వచ్చే విధంగా చూడాలని మంత్రి ఐకే రెడ్డిని కోరారు. కొత్తగా ఏర్పడిన చింతలమానేపల్లి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.1300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వర్షాకాలం దిందా, కేతిని వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గతంలో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, అటవీ శాఖ అనుమతులు రాగానే పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల ఉపాధి కోసం తునికి, పండ్ల వనాలు పెంచాల్సిన అవసరముందన్నారు.
హరితహారంతో అడవుల శాతం పెరిగిందని, ఈ పథకం ద్వారా తునికి, పండ్ల వనాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రీయల్, కలెక్టర్ హేమంత్ బోర్కడే, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, సీసీఎఫ్ వినోద్కుమార్, ఎఫ్డీవో శివ్అశీస్సింగ్, రైతుబంధు జిల్లా చైర్మన్ జగ్గాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, ఎంపీపీలు సులోచన, సుజాత, జడ్పీటీసీలు శ్రీరామారావు, సరిత, రైతుబంధు మండల కన్వీనర్ సంతోష్గౌడ్, డీఎస్పీ కరుణాకర్, సీఐ బుద్ధస్వామి, నాగరాజు, ఎఫ్ఆర్వో అప్పలకొండ, డీఆ ర్వో శ్రీధరచారి, ఎంపీపీలు డుబ్బుల నానయ్య, విశ్వనాథ్, జడ్పీటీసీలు డుబ్బుల శ్రీదేవి, పంద్రం పుష్పలత, ఉమ్మడి జిల్లా పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుమురం మాంతయ్య, కాగర్నగర్ మార్కెట్ వైస్ చైర్మన్ డోకె రాజన్న, తహసీల్దార్ మస్కూర్ అలీ, ఎంపీడీవో మహేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకయ్య, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మంత్రికి ఘన స్వాగతం
కాగజ్నగర్/కౌటాల, ఫిబ్రవరి 27 : కాగజ్నగర్లోని పేపర్ మిల్లు అతిథి గృహం వద్ద మంత్రి అల్లోలకు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, వివిధ శాఖల అధికారులు ఘన స్వాగతం పలికారు. అతిథి గృహంలో అల్పాహారం స్వీకరించి, అక్కడి నుంచి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన సత్రాన్ని ఆయన సందర్శించారు. కాగజ్నగర్, కౌటాల, సిర్పూర్, దహెగాం బెజ్జూర్ మండలాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కోనప్ప మంత్రికి చెప్పారు. కాగజ్నగర్ పట్టణం నుంచి సిర్పూర్(టీ) అటవీ ప్రాంతంలోని భీమన్న దేవర వద్దకు చేరుకొని మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఎకో బ్రిడ్జి నిర్మాణం, జింకల పార్కు నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. మ్యాప్ను చూశారు. అక్కడి నుంచి నాగమ్మ చెరువులోని బుద్ధ విగ్రహాన్ని పరిశీలించారు.
ట్యాంక్ బండ్ తరహాలో నాగమ్మ చెరువును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కౌటాల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నివాసానికి వచ్చిన మంత్రి అల్లోలకు మండల ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనస్వాగతం పలికారు. మండల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్ కోరారు. ఎస్పీ సురేశ్కుమార్, అదనపు ఎస్పీ అచ్చేశ్వర్రావు, ఎఫ్డీవో విజయ్కుమార్, డీఎస్పీ కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ గిరీశ్కుమార్, ఎమ్మెల్యే సతీమణి రమాదేవి, ఇన్చార్జి ఎఫ్ఆర్వో వేణుగోపాల్, కోనేరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోనేరు వంశీ, కౌటాల సర్పంచ్ మౌనీశ్, ఉప సర్పంచ్ తిరుపతి, మొగడ్ధగఢ్ ఎంపీటీసీ మనీష్, కో ఆప్షన్ సభ్యుడు అజ్మత్ అలీ, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, పార్టీ అధ్యక్షుడు వసంత్ రావు, యూత్ అధ్యక్షుడు రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు సంతోష్, ఫణీందర్ గౌడ్, డబ్బా బాపు, రాంచందర్, మధుకర్, సోల్ల బాపు, రమేశ్ నాయకులు పాల్గొన్నారు.