ఎదులాపురం, నవంబర్ 27: భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఆరోగ్యవంతమైన ఓటరు జాబితాను రూపొందించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్టీ పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహంలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులు వారి పరిధిలోని ప్రాంతాల్లో 1 2023 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారందరి పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేయలన్నారు.
ప్రతి వ్యక్తి ఓటరు జాబితాలో ఉండేలా వార్డుల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి వయోజనుల వివరాలు సేకరించి, ఓటరుగా నమోదు చేయాలన్నారు. మరణించిన వారి పేర్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని చెప్పారు. ఆమె వెంట ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీపీఆర్వో ఎస్ భీమ్కుమార్, తహసీల్దార్ సతీశ్, స్వీప్ నోడల్ అధికారి లక్ష్మణ్, నాయబ్ తహసీల్దార్ మహేశ్, కౌన్సిలర్లు రాజు, జాఫర్ అహ్మద్, బూత్ స్థాయి అధికారులు, ఎన్సీసీ కేడెట్లు ఉన్నారు.
సోన్, నవంబర్ 27 : 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ కోరారు. సోన్ మండలం కౌట్ల (కే), జాఫ్రాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు ప్రక్రియను కలెక్టర్ ఆదివారం పరిశీలించారు.18 ఏళ్లు నిండిన వారితో పాటు ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులను ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు. చనిపోయిన వారి పేర్లను ఓటర్ల నుంచి తొలగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, తహసీల్దార్ సుభాష్ చందర్ ఉన్నారు.