దిలావర్పూర్, జూలై 11 : వ్యవసాయమే జీవనాధారంగా బతుకున్న రైతుల కుటుంబాల్లో ఇథనాల్ పరిశ్రమ చిచ్చు పెడుతోంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామ పరిసర ప్రాంతంలో నిర్మించ తలపెట్టగా.. వద్దని రెండు నెలలుగా అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. 35 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసి, పనులు ప్రారంభించినప్పటి నుంచి రైతులు వద్దని అభ్యంతరం తెలుపుతున్నా మిన్నకుంటున్నారు. పరిశ్రమ ఏర్పాటుతో తమ పంట పొలాల్లోకి వ్యర్థాలు చేరుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. రెండు నెలల క్రితం ప్రారంభమైన ఈ పరిశ్రమ పనులను దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల రైతులు పనిస్థలానికి వెళ్లి అడ్డుకున్నారు. పరిశ్రమకు కావాల్సిన మొరం తవ్వకాలను కూడా తమ గ్రామ పరిసర ప్రాంతం నుంచి తీసుకెళ్ల వద్దని గ్రామస్థులు ఆందోళన చేసి అడ్డుకున్నారు. రైతులు, వివిధ పార్టీల నాయకులు కలిసి స్థానిక తహసీల్దార్కు కూడా వినతిపత్రం అందించారు.
ముదురుతున్న ‘ఇథనాల్’లొల్లి
గుండంపల్లి గ్రామంలోని రైతులు సమావేశం నిర్వహించారు. ఈ పరిశ్రమను అడ్డుకోవడానికి పార్టీలకు అతీతంగా ఏకం కావాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. మరసటి రోజు నిర్మల్-భైంసా(జాతీయ రహదారి-16)పై రైతుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా, రాస్తారోకో చేశారు. మరుసటి రోజు కూడా దిలావర్పూర్ గ్రామానికి చెందిన రైతులు, నాయకులు కలిసి మళ్లీ బైఠాయించి ధర్నా చేశారు. అక్కడి నుంచి భారీ సంఖ్యలో పరిశ్రమ వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. ఈ పరిశ్రమ జీరో పొల్యూషన్తో కూడుకున్నదని కంపెనీ వారు రైతులకు నచ్చజెప్పారు.
జీరో పొల్యూషన్తో పరిశ్రమ ఏర్పాటు..
దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ పరిశ్రమ పూర్తిగా జీరో పొల్యుషన్తో నిర్మిస్తున్నాం. దీని వల్ల ప్రజలకు నష్టం లేదు. ఆధునిక సాంకేతికతతో ఈ పరిశ్రమ నిర్మాణం చెపడుతున్నాం. అత్యాధునికి యంత్రాలతో నిర్మిస్తున్నాం.
– నారాయణరెడ్డి, పరిశ్రమ పర్యవేక్షకుడు.
మా పొట్టగొట్టె పరిశ్రమవద్దు..
మా కుటుంబం వ్యవసాయమే జీవనాధా రంగా బతుకుతోంది. మాకు పరిశ్రమ చుట్టు పక్కల 25 ఎకరాల భూమి ఉంది. పరిశ్రమ ఏర్పాటు వల్ల పంటలకు చీడ పీడలు తగిలి పంటలు పూర్తిగా దెబ్బతిం టాయి. మా బోరు బావులు కలుషితమవుతాయి. మా ఆరోగ్యం దెబ్బతిని రోగాల బారిన పడుతాం. మా రైతుల పొట్టగొట్టే ఈ పరిశ్రమ వద్దు. రైతులందరం ఏకమవుతాం. పరిశ్రమ పనులను నిలిపి వేసేలా ఆందోళన చేస్తాం.
– కుంట గంగాధర్, రైతు, దిలావర్పూర్.
పంటలు దెబ్బతింటాయి..
ఇథనాల్ పరిశ్రమ మా పరిసర గ్రామాల్లో ఏర్పాటు చేయడం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతాయి. మా విలువైన భూములు వదిలి పెట్టి వెళ్లాల్సి వస్తుంది. భూముల్లో గడ్డి కలుషితమై పశువులు అనారోగ్యం పాలవుతాయి. పంటలు దెబ్బతిని జీవానాధారం కోల్పోతాం.ఈ పరిశ్రమ మాకు వద్దు.
– రాజరెడ్డి, రైతు, గుండంపల్లి.