దస్తురాబాద్,జూన్ 25 : త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు, బోగస్ ఏరివేతపై ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించింది. మండలంలోని 20 పొలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఓటర్ల జాబితాలో మార్పు లు, చేర్పులు, సవరణలు ప్రారంభం కాగా, బీల్వోలు గ్రామాల్లో పర్యటించారు. ఈ నెల 16 నుంచి 20 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల విరాలు తెలుసుకున్నారు. 100 శాతం సర్వేను పూర్తి చేశా రు. ఈనెల 22,23 తేదీల్లో మండలంలో ఉన్న 20 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు.
ఆయా పోలింగ్ కేంద్రాల్లోని మౌలిక సదుపాయాలపై ఆరా తీసి అధికారులు వివరాలు నమోదు చేసుకున్నారు. జూలై 24 నుంచి ఆగస్టు 31 వరకు సవరణలు పరిశీలన, ముసాయిదా జాబితా ప్రచురణ, సెప్టెంబర్ 2నుంచి 31 వరకు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం,అక్టోబర్లో తుది ఓటర్ జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. బీఎల్వోలు చేసిన సర్వేలో 205 కొత్తగా ఓటరు నమోదుకు, 808 చేర్పులు, మార్పులకు, 82 తొలగింపునకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.2023 అక్టోబర్ ఒకటో తేదీ నాటికి వయోజనులు ఓటరు నమోదుకు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
100 శాతం సర్వే పూర్తి…
ప్రస్తుతం ఒకే ఇంటి నంబరుతో ఎక్కువ మంది ఓటర్ల పేర్లు జాబితాలో ఉన్నాయని గ్రహించిన ఎన్నికల సంఘం సవరణ దిశగా చర్యలు చేపట్టింది. మండలంలోని 20 పోలింగ్ కేంద్రాల్లో 4805 ఇండ్లు ఉన్నాయి. మొత్తం 12251 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 6013, మహిళలు 6238 మంది ఉన్నారు. సర్వేలో భాగంగా ఇంటి నంబర్లో ఎంత మంది ఓటర్లు ఉన్నారనే వివరాలు సేకరించారు. ఓటర్లు నమోదు చేయించుకున్న వారు సదరు ఇళ్లల్లో ఉంటున్నారా లేదా అని ఆరా తీశారు. కాగా నూతన ఓటరు నమోదు కోసం, చేర్పులు, మార్పులు,తొలగింపు కోసం వచ్చిన దరఖాస్తుల ను ఆన్లైన్ వివరాలను నమోదు చేస్తున్నారు.
బోగస్ ఓట్లకు చెక్…
ఎలాంటి తప్పుల్లేని ఓటరు జాబితాను రూపొందించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. గతంలో ఆధార్ అనుసంధానం, రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే తొలగించిన అధికారులు ప్రస్తుతం ఇంటి నంబర్ ఆధారంగా ఓటర్ల జాబితాను జల్లెడ పడుతున్నారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు తీసుకోని, ఆన్లైన్ నమోదు చేస్తున్నారు.ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో బోగస్ ఓటర్లను జాబితా నుంచి తొలగించడానికి అవకాశం ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవాలి
ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది.ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల సవరణలకు సంబంధించిన దరఖాస్తులను తీసుకుని పరిష్కరిస్తున్నాం. బోగస్ ఓట్ల తొలగింపునకు ప్రత్యేక కార్యచరణ చేపట్టాం. ఓటర్ జాబితాను పడక్బందీగా చేపడుతున్నాం. ఇప్పటికే బీఎల్వోలు సర్వే పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాలను సైతం పరిశీలించి వివరాలను నమో దు చేసుకున్నాం. అక్టోబర్ ఒకటో తేదీ నాటికి అర్హులైన వారు ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి.
జీ.లక్ష్మి, తహసీల్దార్,దస్తురాబాద్