కెరమెరి, ఏప్రిల్ 15 : తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ఓటర్లు ఈ సారి ఎటు వేయనున్నారో రెండు రాష్ర్టాల అధికారులు, నాయకులకు అంతుచిక్కడం లేదు. 2019 పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి రావడంతో ఆ ప్రాంత ప్రజలు కొందరు మహారాష్ట్రలో, మరికొందరు తెలంగాణలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ, ఈ సారి ఎన్నికల తేదీలు వేర్వేరుగా మారడంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే విషయంపై ఏమీ తోచక నాయకులు అయోమయానికి గురవుతున్నారు. రెండు రాష్ర్టాల్లో ఎన్నికలు ఉండడంతో రెండుసార్లు ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారా.! ఒకవేళ ఒకే ఓటుకు అనుమతి ఇస్తే ఏం చేయాలో తోచక ప్రజలు సందిగ్ధంలో పడ్డారు.
19న మహారాష్ట్ర పార్లమెంట్ ఎన్నికలు ఉండగా, వచ్చే నెల 13న తెలంగాణ ఎంపీ ఎన్నికలు జరుగనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహ ద్దు వివాదస్పద గ్రామాల్లోని ప్రజలకు రెండు చోట్లా ఓటు హక్కు ఉన్నది. తెలంగాణ అయినా, మహారాష్ట్ర అయినా ఎన్నికల్లో ఓ టు వేసేందుకు సుప్రీం కోర్టు వారికి అవకాశం కల్పించింది.
కొన్ని సందర్భాల్లో ఎన్నికల తేదీల్లో కొన్ని నెలల తరబడి జాప్యం ఉన్నప్పుడు ఆ ప్రాంత ఓటర్లు ఒకసారి అటూ, మరోసారి ఇటూ ఓట్లు వేస్తూ రెండు రాష్ట్రల్లోనూ పూర్తిస్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భాలున్నాయి.
ఇదే తరహలో తెలంగాణ-మహారాష్ట్ర కొన్ని రోజుల వ్యవధిలోనే ఎన్నికలు రాగా, ఒక రాష్ట్రం చూపుడు వేలుకు, ఇంకో రాష్ట్రం మధ్య వేలుకు ఇంక్ పూసి సజావుగా ఎన్నికలు జరిపిన సంఘటనలూ ఉన్నాయి. ఈ విధంగా అనేక రకాలుగా జరిగిన ఎన్నికల పరిణామాలను గ్రహించిన ఎన్నికల కమిషన్.. ఒకే ఓటు వేయాలని ఆంక్షలు విధించడంతో పరిస్థితి జఠిలమైంది. దీంతో మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలకు ఎన్నికలు ప్రతిసారీ సవాల్గా మారుతున్నాయి. గతంలో జరిగినట్లే వేలు మార్చి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారా..? లేదా అడ్డుకుంటారో తెలియని పరిస్థితి నెలకొన్నది. మహారాష్ట్ర, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు కేవలం 24 రోజుల తేడా ఉండడంతో ఈ సారి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో వేచి చూడాల్సిందే.