సారంగాపూర్, ఫిబ్రవరి 10: వృద్ధ మహిళలకూ ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల్లో 18 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు మాత్రమే అవకాశం ఉండేది. 60 ఏళ్లు నిండిన వారిని గ్రూపుల నుంచి తొలగించేవారు. కాగా, వారిని కూడా ఇకపై కొనసాగించేలా నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు నిండిన మహిళల వివరాలు సేకరించాలని జిల్లా సెర్ప్ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో సెర్ప్ అధికారులు గ్రామాల్లో తిరుగుతూ సర్వే చేస్తున్నారు.
ఎస్హెచ్జీల లక్ష్యమిదే..
నేషనల్ రూరల్ లైవ్లీ మిషన్ గైడ్లైన్స్ ప్రకారం గ్రూపులో కనీసం 10 మంది సభ్యులు ఉండాలి. అందుబాటులో ఉన్న బ్యాంక్ ఖాతా తెరవాలి. సంఘంలో చేరిన మహిళలు రెగ్యులర్గా సమావేశం నిర్వహించుకోవాల్సి ఉంటుంది. 1990 నుంచి పేద మహిళలను గుర్తించి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేశారు. 10 నుంచి 15 మందితో కూడిన సంఘాలు ఏర్పాటు చేసి వారితో బ్యాంకుల్లో పొదుపు చేయిస్తున్నారు. బ్యాంకుల ద్వారా రూ. లక్ష నుంచి రూ. 12 లక్షల వరకు రుణాలు ఇప్పిస్తూ మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. సాధారణంగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరడానికి 18 ఏళ్ల పైబడిన వారు అర్హులు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు జిల్లా సమైక్య, 67 మండల సమైక్య, 1923 గ్రామ సమైక్య, 41,046 స్వయం సహాయ సంఘాలు ఉన్నాయి. ఇందులో 4,40, 246 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు.
కొనసాగుతున్న సర్వే…
స్వయం సహాయక సంఘాల్లో ఉండి 60 ఏళ్లు నిండిన తరువాత తొలగించిన మహిళల వివరాలు సెర్ప్ నుంచి డీఆర్డీవోకు అందాయి. మరోవైపు గ్రామాల్లో కూగా సమావేశాలు ఏర్పాటు చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఆ తర్వాత సంఘాలను ఏర్పాటు చేయనున్నారు.
స్వయం ఉపాధికి రుణాలు…
పొదుపు సంఘాల్లో 60 ఏళ్లు పైబడిన వారికి సంబంధించి తుది గైడ్లైన్స్ రావాల్సి ఉంది. ప్రస్తుత సంఘంలో ఉన్న సభ్యులకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నారు. ఆయా డబ్బులతో అనేక మంది సొంతంగా కిరాణా దుకాణాలు, ఫ్యాన్సీ, టైలరింగ్, ప్లేట్ల తయారీ, జిరాక్స్ సెంటర్, కూరగాయలు, మెడికల్ దుకాణాలు, గొర్రెలు, మేకలు, పాడిపశువులు, బ్యాంగిల్ స్టోర్స్, ఆలు చిప్స్, మెకానిక్ దుకాణాలు, పచ్చడిల తయారీ, చిరువ్యాపారాలు, హోటల్స్, వర్మి కంపోస్టు తదితర వ్యాపారాలు చేస్తున్నారు. 60 ఏండ్ల పైబడిన వారు వారికి తోచిన వ్యాపారం చేసుకునే వీలు కలుగుతుంది.
పొదుపుతో పాటు ఆర్థిక భరోసా
మలి వయస్సులో ఆర్థిక భరోసాకు ప్రభుత్వ నిర్ణయం దోహద పడుతుంది. 60 ఏండ్ల పైబడిన వారికి ఇది మంచి అవకాశం. గతంలో ఉన్నా కొన్ని కారణాలతో అధికారులు తొలగించిన్రు. ఇప్పుడు మళ్లీ అవకాశం కల్పించి, మంచి పని చేసిన్రు. ఏదైనా ఉపాధి పొందాలంటే ఈ రుణాలు ఉపయోగాపడతాయి. -రావుల అనసూయ, జామ్
వృద్ధ మహిళలకు చేయూత…
స్వయం సహాయ గ్రూపుల్లో మహి ళల వయస్సు 60 ఏండ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం హర్షనీయం. ప్రభుత్వ నిర్ణయం వల్ల మహిళలకు ఊరట లభించింది. ఇది వరకే వృద్ధులకు సీఎం కేసీఆర్ రూ. 2016 ఇచ్చి జీవితాల్లో వెలుగులు నింపుతున్నరు. వృద్ధ మహి ళలను సంఘాల్లో చేర్చుతున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-మహిపాల్ లచ్చవ్వ, జామ్
సర్వే నిర్వహిస్తున్నాం..
60 ఏళ్లు నిండిన వారి వివరాల ను సేకరించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. గ్రామాల్లో మా సెర్ప్ సిబ్బం ది సర్వే చేస్తున్నారు. గ్రామా లు, మండలాల వారీగా జా బితాను తయారు చేస్తాం. అనంతరం మా సిబ్బం ది ఇంటింటికీ వెళ్లి సంఘాల ఏర్పాటు, ఉపయోగా లను వివరిస్తారు. అనంతరం కొత్త సంఘాలను ఏర్పాటు చేస్తారు.
-విజయలక్ష్మి, డీఆర్డీవో, నిర్మల్ జిల్లా