ఎదులాపురం, ఏప్రిల్ 19: జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శాంతిభద్రతలపై స్థానిక పోలీస్ హెడ్క్వార్టర్లోని సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 21 పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, దర్యాప్తు వివరాలు అడిగి తెలుసుకున్నారు. న్యాయస్థానం పరిధిలో విచారణలో ఉన్న కేసుల స్థితిగతులపై వివరణ తీసుకున్నారు. సాక్షుల విచారణలో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పూర్తి సహకారం అందించాలని నిర్ణయించారు. గంజాయి నిర్మూలకు ఊరూరా అవగాహన సదస్సులు నిర్వహించి వాటి వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు.
జాతీయ రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు , ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. గత నెలలో జిల్లాలోని అన్ని వర్టికల్స్ అంశాల్లో ప్రతిభ చూపిన 12 మంది పోలీస్ సిబ్బందికి నగదు, ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేసి కోర్టులో హాజరు పర్చాలని సూచించారు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, డీఎస్పీలు వెంకటేశ్వరరావు, ఎం విజయ్ కుమార్, ఏవో యూనుస్ అలీ, సీఐలు పీ సురేందర్, కే శ్రీధర్, బీ రఘుపతి, కే మల్లేశ్, ఎం మల్లేశ్, గుణవంతరావు, ఈ చంద్రమౌళి, జే కృష్ణమూర్తి, ఆర్ఐలు శ్రీపాల్, డీ వెంకటి, సీసీ దుర్గం శ్రీనివాస్, జీ వేణు, డీసీఆర్బీ, ఐటీ కోర్, ఎస్ఐబి సిబ్బంది పాల్గొన్నారు.
బాల్య వివాహాలను నిర్మూలించాలని కోరుతూ ఎంవీ ఫౌండేషన్, బాలల పరిరక్షణ వేదిక, మీ అక్షయ పాత్ర ఆధ్వర్యంలో రూపొందించిన వాల్పోస్టర్లను పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఆయా సంఘాల ప్రతినిధులతో కలిసి ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి మంగళవారం విడుదల చేశా రు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. గ్రామాల్లో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వాల్ పోస్టర్లను జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అతికించాలని సూచించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటస్వామి, డీసీపీవో రాజేంద్రప్రసాద్, చైల్డ్లైన్ కో ఆర్డినేటర్ తిరుపతి, బాలల పరిరక్షణ వేదిక కార్యదర్శి సాంబశివ్, కన్వీనర్ పెందూర్ మధు, కార్యదర్శి దత్తురాజు, మీ అక్షయపాత్ర అధ్యక్షుడు ఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.