మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 15: పదో తరగతిలో ప్రతి సబ్జెక్టులో మంచి మార్కులు సాధించేందుకు అంతర్గత మార్కులూ కీలకమే. దీనికి సంబంధించి పరిశీలన జిల్లాలో మంగళ వారం ప్రారంభమైంది. పరిశీలన బాధ్యతను ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే హెచ్ఎంలకు అప్పగించారు. వీరికి తోడు ఆరు సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు సభ్యులుగా ఉంటారు. జిల్లాలో 245 పాఠశాలల్లో 9,298 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు.
ఈ విద్యార్థుల అంతర్గత మార్కులను వీరు పరిశీలిస్తున్నారు.మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించిన నాలుగు నిర్మాణాత్మక మూల్యాంకన (ఎఫ్ఏ) పరీక్షల మార్కులను నమోదు చేసిన రికార్డులను పరిశీలిస్తున్నారు. వార్షిక పరీక్షలో ఒక్కో సబ్జెక్టుకు 80, అంతర్గత పరీక్షలకు 20 మార్కులుంటాయి. నాలుగు ఎఫ్ఏల్లో సాధించిన సగటు మార్కుల ఆధారంగా 20 మార్కులకు ఎన్ని మార్కులు వేయాలో నిర్ణయిస్తారు. వీటిని వార్షిక పరీక్షల్లో సాధించే మార్కులకు కలుపుతారు. అందుకే ఈ మార్కులు చాలా కీలకం. ఇందుకోసం బృందంలోని సభ్యులంతా విద్యార్థుల మార్కుల రికార్డులు పరిశీలిస్తున్నారు.
పాఠశాలల్లో అంతర్గత మార్కుల పరిశీలన పారదర్శకంగా జరుపాలని ఆదేశాలిచ్చాం. నిబంధనల ప్రకారం 42 బృందాలను ఏర్పాటు చేశాం. వీటి పనితీరును ఎంఈవోలు పర్యవేక్షించాలని కోరాం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. ఈ నెల 17వ తేదీ వరకు పరిశీలన పూర్తి చేయాలి. ఆ వివరాలను ఈ నెల 22 నుంచి సంబంధిత వెబ్సైట్(www.bse. telangana.gov.in)లో నమోదు చేయాలి. 29వ తేదీ వరకు పూర్తి చేయాలి.
– ఎస్ యాదయ్య, డీఈవో, మంచిర్యాల