ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన వైద్యరంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. సర్కారు దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నది. వైద్యవిద్యకు కూడా ప్రోత్సాహం అందిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో వైద్య కళాశాలను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పలు జిల్లాల్లోని మెడికల్ కళాశాలలను ప్రారంభించారు. వైద్య విద్యార్థులకు వివిధ విభాగాల్లో ఉన్నత చదువులు చదువుకునేందుకు ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రిమ్స్ (రాజీవ్గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో పీజీ కోర్సులను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పది విభాగాలు ఉండగా 38 మంది వైద్యులు ఇందులో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
– ఆదిలాబాద్, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, డిసెంబర్ 5 ( నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో వైద్య రంగాన్ని గత పాలకులు విస్మరించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమైక్య పాలనలో ఆదిలాబాద్ జిల్లా పేదలకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. మారుమూల గ్రామాలు, ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో సీజనల్ వ్యాధుల కారణంగా మరణాలు సంభవించేవి. వచ్చిన రోగాన్ని తగ్గించుకునేందుకు ప్రజలు హైదరాబాద్తో పాటు మహారాష్ర్టలోని నాగ్పూర్, యావత్మాల్ లాంటి పట్టణాల్లోని కార్పొరేట్ దవాఖానలను ఆశ్రయించేవారు. వ్యాధులను తగ్గించుకోవడానికి భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు, సిబ్బంది నియామకంతో పాటు మందులు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచింది. గర్భిణులు ప్రసవం కోసం ప్రైవేట్ వైద్యశాలకు పోయి వేల రూపాయలు ఖర్చు చేయకుండా సర్కారు దవాఖానల్లోనే డెలివరీలు అయ్యేలా అన్ని వసతులు కల్పించింది. ఫలితంగా ప్రజలు సర్కారు వైద్య సేవలు పొందుతూ ఆరోగ్యంగా ఉంటున్నారు.
వైద్యవిద్యకు పెద్దపీట..
ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు మరింత చేరువ కావడంతో పాటు విద్యార్థులు తమ బంగారు భవిష్యత్ను తీర్చిదిద్దుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా జిల్లాకు ఒక వైద్యకళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పలు వైద్య కళాశాలలను ప్రారంభించారు. దీంతో వైద్యవిద్యలో ఎంబీబీఎస్ సీట్లు బాగా పెరిగాయి. గతంలో వైద్య విద్య చదువాలంటే ఎంతో కష్టంగా భావించే విద్యార్థులు.. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల కోసం పోటీపడి చదివి ఇక్కడే సీట్లు సంపాదిస్తున్నారు.
రిమ్స్లో పలు విభాగాల్లో పీజీ సీట్లు..
ఆదిలాబాద్ రిమ్స్లో 2008 నుంచి ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభమైంది. మూడేండ్లుగా పీజీ సీట్లను ప్రభుత్వం ప్రవేశపెడుతున్నది. రిమ్స్లో జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, అప్తమాలజీ, గైనకాలజీ, ఈఎన్టీ, ఫోరెన్సిక్, పైథాలజీ, బయోకెమెస్ట్రీ, పల్మనాలజీ, ఫిజియాలజీ విభాగాల్లో పీజీ చదివే అవకాశం ఉంది. ఈ విభాగాల్లో 38 సీట్లు ఉన్నట్లు రిమ్స్ అధికారులు తెలిపారు. ఇటీవల నిర్వహించిన కౌన్సెలింగ్లో పలు విభాగాల్లో సీట్లు భర్తీ అయ్యాయి. మరో ఆరు కొత్త కోర్సులకు గానూ నేషనల్ మెడికల్ కమిషన్( ఎన్ఎంసీ)కు దరఖాస్తు చేసుకున్నట్లు రిమ్స్ డైరెక్టర్ రాథోజ్ జైసింగ్ తెలిపారు. పీజీలో జనరల్ మెడిసిన్, అనస్తిషియా, పల్మనాలజీ, అనాటమీ, కమ్యూనిటీ మెడిసిన్ కోర్సులకు అనుమతి కోరామని, ఎన్ఎంసీ అధికారులు కళాశాలను సందర్శించి కొత్త కోర్సుల అవకాశాలు పరిశీలిస్తారని ఆయన తెలిపారు.
పీజీ విద్యార్థులకు రిమ్స్ అనుకూలం
వైద్యవిద్యలో పీజీ చేసే విద్యార్థులకు రిమ్స్ ఎంతో అనుకూలమైంది. వివిధ రకాల వ్యాధులతో ప్రజలు, ఎమర్జెన్సీ కేసులు ఎక్కువ వస్తుండడంతో వారికి పలు అంశాలను నేర్చుకునే అవకాశం లభిస్తుంది. వివిధ విభాగాల్లో నిపుణులైన సీనియర్ వైద్యుల వద్ద పలు అంశాలు తెలుసుకోవచ్చు. పేదలు, గిరిజనులకు సేవ చేసే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం రిమ్స్లో పది విభాగాల్లో 38 సీట్లు ఉండగా.. 28 భర్తీ అయ్యాయి. మరో విడుత కౌన్సెలింగ్లో ఖాళీగా ఉన్న సీట్లలో వైద్యులు చేరుతారు.
– రాథోడ్ జైసింగ్, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్
అన్ని సౌకర్యాలున్నాయి..
ఆదిలాబాద్ రిమ్స్లో బయో కెమెస్ట్రీ పీజీ మూడో సంవత్సరం చదువుతున్నా. ఇక్కడ పీజీ చేయడానికి అన్ని రకాల సౌకర్యాలున్నాయి. టీచింగ్ సైతం చాలా బాగుంది. పీజీ కర్క్యూలమ్, అన్ని విషయాలు అందుబాటులో ఉన్నాయి. వసతులు అన్ని ఉండడంతో తొందరగా నేర్చుకునే అవకాశాలుంటాయి.
– ప్రత్యూష, బయో కెమెస్ట్రీ, పీజీ విద్యార్థిని, రిమ్స్