రుతు పవనాలు ఆలస్యం కావడంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. సాగుకు అదునుదాటి పోతోందని అన్నదాతలు దిగాలు పడుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు, తెలంగాణ లైఫ్లైన్గా పిలుచుకునే కాళేశ్వర గంగ వరంగా మారనుంది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ సాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ)లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. జలాలు చేరడంతో ఎస్సారెస్పీ నీటి మట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,060 అడుగుల(21టీఎంసీలు) నిల్వ ఉంది. ఫలితంగా నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీరు, 36 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. సరస్వతీ కెనాల్ ద్వారా 47 కిలోమీటర్ల మేర ఆయకట్టుకు కూడా నీరందనుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో, స్థానికంగా వర్షాలు కురవకున్నా తాగు, సాగు నీటికి ఢోకా ఉండదని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– సోన్, జూలై 11
సాగు నీటికి ఢోకా లేదు..
నాది సోన్ మండలంలోని న్యూవెల్మల్. ఎస్సారెస్పీ నుంచి సరస్వతీ కెనాల్ ద్వారా వచ్చే నీటితో పంటలు వేసుకుంటం. ఏటా మహారాష్ట్రలో, స్థానికంగా వర్షాలు కురిసి ప్రాజెక్టు నిండితే.. ఆ నీటి ద్వారా ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో పంటలు వేస్తం. ఇప్పుడు కాళేశ్వరం జలాలతో ప్రాజెక్టు నిండుతున్నది. ఇప్పటికే దుక్కులు దున్ని నారుమళ్లు సిద్ధం చేసుకున్నం. ఈ నెలలోనే నాటు వేయడానికి సిద్ధంగా ఉన్నం. సాగుకు నీరందిస్తున్న సీఎం సారుకు రుణపడి ఉంటం.
– ఎర్రయ్య, రైతు, న్యూవెల్మల్, సోన్ మండలం.
సోన్, జూలై 11 : కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ)లోకి జలాలు చేరుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ సమీపంలో గల ఎస్సారెస్పీ మహారాష్ట్రలో కురిసే వర్షాలకు, స్థానికంగా కురిసే వర్షాలకు నిండుతుంది. ఎస్సారెస్పీ నుంచి సరస్వతీ కెనాల్ ద్వారా చేలకు నీరందుతోంది. యేటా గోదావరి పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురవాలని రైతులు వేయి కండ్లతో ఎదురు చూసేవారు. అయితే ఈ సంవత్సరం నుంచి వర్షాలు కురవకున్నా పంటలు పండించుకోవచ్చని భావిస్తున్నారు. కాళేశ్వరం నీటిని లిఫ్టుల ద్వారా ఎత్తిపోస్తూ వరద కెనాల్ ద్వారా మళ్లించే ప్రక్రియను మూడు రోజుల క్రితం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించడంతో జలాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి చేరాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా.. 1,060 అడుగుల(21టీఎంసీలు) నిల్వ ఉంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ మహారాష్ట్రలో వర్షాలు కురవకపోవడంతో శ్రీరాంసాగర్కు వరద ఆశించినస్థాయిలో రాలేదు. ప్రస్తుతం కాళేశ్వరం జలాలతో ప్రాజెక్టు నిండుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సాగు, తాగు నీటికి పూర్తి భరోసా..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాలు చేరుతుండడంతో నిర్మల్ జిల్లావాసులకు తాగు, సాగునీటికి పూర్తిస్థాయిలో భరోసా కలుగనుంది. సోన్ మండలంలోని లోకల్ వెల్మల్ గ్రామం వద్ద నిర్మల్ నియోజకవర్గానికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించే ప్రధాన పంపు ఉండడం వల్ల అన్ని గ్రామాలకు నీటి కొరత తీరనుంది. అదే విధంగా సరస్వతీ కెనాల్ ద్వారా సోన్, లక్ష్మణచాంద, నిర్మల్ రూరల్, మామడ, ఖానాపూర్, కడెం, పెంబి మండలాల్లోని 36 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టు నుంచి పెంబి వరకు సుమారు 47 కిలోమీటర్ల మేర కాలువ ఉండడంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యేటా మహారాష్ట్రలో వర్షాలు కురిస్తే జూన్, జూలై మాసాల్లో ప్రాజెక్టు నిండి ఆగస్టులో ఆయకట్టుకు నీరందేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదనిపిస్తోందని రైతులు పేర్కొంటున్నారు. సరస్వతీ కెనాల్ పరిధిలోని చెరువులకు నీటిని మళ్లించి సాగు చేసేవారు. ఇప్పుడు కాళేశ్వరం నీరు కళ్లముందే కన్పించడంతో సరస్వతీ కెనాల్ ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరి సాగు చేసే రైతులు వరి నాళ్లు సిద్ధం చేసుకొని ఉన్నారు. నీటిని విడుదల చేసిన మరుక్షణమే నాట్లను వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మహారాష్ట్రలో వర్షాలు కురవకున్నా కాళేశ్వరం నీళ్లు రావడంతో వానకాలంలో సరస్వతీ కెనాల్ నీళ్లు వస్తాయని ఆశతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు.
సీఎం కేసీఆర్ కల సాకారమైంది..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం నీటిని మళ్లిస్తాయని ఎన్నికల సమయంలో చెప్పితే కింది నీరు మీదికి ఎలా వస్తాయని మేము నమ్మలేదు. మొన్ననే కాళేశ్వరం నీటిని ఎత్తిపోతల ద్వారా శ్రీరాంసాగర్ వరద కెనాల్ ద్వారా నీరు చేరుకోవడంతో మాకెంతో సంతోషమన్పించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఇస్తే అది నెలబెట్టుకునే మనిషి. 30 ఏళ్లుగా సరస్వతీ కెనాల్ కింద ఆయకట్టు సాగు చేస్తున్నాం. వర్షాలు పడి ప్రాజెక్టు నిండితేనే పంటలు పండేవి. లేకుంటే ఎండేవి. ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు రావడంతో నిర్మల్, సోన్ మండలంలోని రైతులకు ప్రయోజనం చేకూరింది.
– మోహినొద్దీన్, బీఆర్ఎస్ మండల కన్వీనర్, గంజాల్.