ఎదులాపురం, జనవరి 30 : కుష్టు వ్యాధిపై మరింత అవగాహన కల్పించాలని డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్లోని హమాలీవాడ యూపీహెచ్సీలో జాతీయ కుష్టు నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్టు వ్యాధి మైక్రో బ్యాక్టీరియా లేప్రే అనే బాక్టీరియా వల్ల వస్తుందన్నారు. స్పర్శ్ పక్షోత్సవాల్లో భాగంగా ఈ నెల30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
అనంతరం కుష్టు నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ గజానన్ మాట్లాడుతూ ఈ వ్యాధికి అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా మందులు అందజేస్తామన్నారు. అంతకుముందు మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకొని మహాత్మాగాంధీ చిత్రపటానికి, కుష్టు వ్యాధి కారక సూక్ష్మక్రిమిని కనుగొన్న శాస్త్రవేత్త డాక్టర్ హన్సన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అందరితో కుష్టు వ్యాధి నివారణకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, కౌన్సిలర్ కేశవ్, కమ్యూనిటీ ఆర్గనైజర్ రణిత, డిప్యూటీ పారామెడికల్ అధికారులు మధుసూదన్రావు, వామన్రావ్, ఎల్టీ రమణాచారి, కిరణ్, నవీన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
జైనథ్, జనవరి 30 : ప్రజలందరి సహకారంతో కుష్టు నివారణ సాధ్యమవుతుందని వైద్యురాలు నయనత అన్నారు. మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా మంగళవారం జైనథ్ గ్రామ పంచాయతీలో కుష్టు వ్యాధి నిర్మూలన పక్షోత్సవాల భాగంగా అవగాహన కల్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. గ్రామానికి చెందిన కుష్టు వ్యాధిగ్రస్తురాలిని సన్మానించారు. కార్యక్రమంలో సూజర్వైజర్ వేణు, సర్పంచ్ దేవన్న, గణేశ్ యాదవ్, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బోథ్, జనవరి 30 : బోథ్ గ్రామ పంచాయతీలో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు కుష్టు వ్యాధి నివారణకు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్ యాదవ్, సుమంగళ, స్నేహ, జీవన్ రెడ్డి, కట్ట భూమేశ్, షేక్ నాజర్ అహ్మద్, షేక్ షాకీర్, తుకారాం, శంకర్, రాజారాం, ఆశ కార్యకర్తలు శారద, యశోద, ప్రమీల, శోభ, పుష్పలత, అరుణ పాల్గొన్నారు.
నార్నూర్, జనవరి 30 : కుష్టు వ్యాధిపై నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య పర్యవేక్షకుడు చౌహాన్ చరణ్దాస్ అన్నారు. గుంజాల గ్రామంలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్టు వ్యాధి నివారణకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది హిమబిందు, ఈశ్వరి, విద్యారాణి, ఉపాధ్యాయుడు రాంరావ్, ఉప సర్పంచ్ చంద, ఆశకార్యకర్తలు సత్యశీల, నాగుబాయి పాల్గొన్నారు.