మంచిర్యాల ఏసీసీ, మార్చి 2 : నేటి నుంచి ప్రారంభమవుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డా.జీ.సుబ్బారాయుడు కోరారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైద్యాధికారి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. 3న కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తారని, 4, 5వ తేదీల్లో పల్స్ పోలియో బృందాలు ఇంటింటికీ తిరిగి చుక్కలు వేస్తారని చెప్పారు. ప్రయాణంలో ఉన్నవారు తమ పిల్లలకు బస్టాండ్, రైల్వేస్టేషన్లలో వేయించుకోవచ్చని తెలిపారు.
జిల్లాలో 75,737 మంది చిన్నారులకు చుక్కలు మందు వేయాల్సి ఉందని, ఇందుకోసం 459 బూత్లను ఏర్పాటు చేశామని, 918 మంది సిబ్బందిని కేటాయించామని, 25 మొబైల్ టీమ్లు, 25 ట్రాన్సిట్ టీమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేడు ఎంసీహెచ్లో కలెక్టర్ సంతోష్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం వాల్ పోస్టర్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డీఐవో డా.అనిత, ప్రోగ్రాం అధికారి డా.నీరజ, డిప్యూటి డీఎంహెచ్వో డా.విజయ పూర్ణిమ, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.