ఆదిలాబాద్ రూరల్, మే 22 : గ్రామీణ యువత క్రీడా రంగాల్లో రాణించేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నదని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్లతో కలిసి కలెక్టర్ రాహుల్ రాజ్ సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలను క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2023 పోటీల్లో క్రీడాకారులు పతకాలు సాధించి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలన్నారు. అన్ని రంగాలతోపాటు ఆదిలాబాద్ జిల్లాను క్రీడా రంగంలో ముందు వరుసలో నిలపాలని కోరారు. ఎంపీడీవోలు, మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో మండలస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించామన్నారు. అదే స్ఫూర్తితో మూడు రోజులపాటు నిర్వహించే జిల్లాస్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేయాలని కోరారు.
జిల్లాస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. మండలస్థాయిలో ఐదు వేల మంది పాల్గొనగా.. జిల్లాస్థాయికి 658 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నదని తెలిపారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యేలు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఎస్బీఐ, ఎల్ఐసీ స్టాల్స్ను, స్విమ్మింగ్ ఫుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్నానపు గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీఎస్పీ ఉమేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, జిల్లా ఒలింపిక్ క్రీడా అధ్యక్షుడు బీ గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు.