కుభీర్/భైంసా టౌన్, జూలై 5 : భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని.. కొత్తగా అటవీ భూములను దున్నడం, చెట్లను నరికివేయడం ఆపేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే విఠల్రెడ్డితో కలిసి గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. కాగా.. బోథ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాపురావ్ బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్ మండల కేంద్రాల్లో గిరిజనులకు పట్టాలు పంపిణీ చేశారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లో జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే జోగు రామన్న పట్టాలు పంపిణీ చేశారు. – నమస్తే నెట్వర్క్
భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని అటవీ భూములకు విఘాతం కలగకుండా అడవులను రక్షించుకునేందుకు ప్రభుత్వం తొమ్మిదేళ్లలో 260 కోట్ల మొక్కలను నాటించినట్లు రాష్ట్ర దేవాదాయ, అటవీ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో బుధవారం గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. మండలంలోని 278 మంది గిరిజన రైతులకు 400 ఎకరాల పోడు భూములకు పట్టాలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సీఎం కేసీఆర్ పోడు పట్టాలు అందించేందుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. 1.50 లక్షల కుటుంబాలకు 4 లక్షల ఎకరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అటవీ భూములను దున్నడం ఆపేయాలని సూచించారు. భూములను దున్నుకుంటూ పోతే ఆక్సిజన్ దొరికే పరిస్థితి ఉండదన్నారు. భావితరాలు ఆనందంగా జీవించాలంటే అడవులు పెంచాలని పిలుపునిచ్చారు. అడవుల్లోని చెట్లను అక్రమంగా నరికివేయడం, కొత్తగా అటవీ భూములను సాగు చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. పోడు పట్టాలు పొందిన గిరిజన రైతులందరికీ రూ. 23 కోట్ల రైతుబంధుతో గిరి వికాసం పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొన్నారు. పోడు భూములంటూ కొత్తగా ఎవరూ భూములను చదును చేయవద్దని సూచించారు. మీ అందరి ఆశీర్వాదాలు బీఆర్ఎస్పై ఉండాలని ఆకాంక్షించారు.
రెండు పంటలకు భరోసా.. : ఎమ్మెల్యే విఠల్రెడ్డి
గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూ పట్టాలు అందజేయడం శుభ పరిణామమని ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొన్నారు. దీనికి గాను ఇప్పుడు పట్టాలు పొందిన రైతులందరికి రైతుబంధుతోపాటు రైతుబీమా పథకాలు వర్తింపజేస్తున్నట్లు సీఎం ప్రకటించడం హర్షించదగినదన్నారు. రెండు పంటలు పండించుకునేందుకు గిరివికాసం పథకం ద్వారా మోటారు అందజేసి భరోసా కల్పిస్తున్నట్లు వివరించారు. మరికొంత మందికి పట్టా పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పిదాలను జిల్లా పరిధిలోనివి కలెక్టర్ సరిదిద్దాలని పేర్కొన్నారు. అంతకుముందు మాలేగాం పరిసర గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి మాలేగాంను మండలంగా ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. పోడు పట్టా పాసుపుస్తకాల జారీలో దొర్లిన తప్పులను పరిష్కరించేలా ఉన్నట్లయితే తప్పకుండా జిల్లాస్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ వరుణ్రెడ్డి పేర్కొన్నారు.
మాలేగాంను మండలం చేస్తాం..
నిర్మల్ జిల్లాలోని 41 జీపీలతో అతిపెద్ద మండలంగా ఉన్న కుభీర్ను మండల ప్రజలు, నాయకులు ఆకాంక్షల మేరకు మాలేగాం పరిసర 17 జీపీలను చేర్చుకొని మండలంగా ఏర్పాటు చేసేందుకు తనవంతు కృషి చేస్తానని మంత్రి అల్లోల పేర్కొన్నారు. తాను మీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి సీఎం కేసీఆర్ను కలిసి ఈ విషయమై వివరిస్తామని తెలిపారు. మాలేగాం మండలం చేయడంతో పరిపాలనా సౌలభ్యం ఏర్పడుతుందని అన్నారు. కుభీర్లో సీహెచ్సీని ఏర్పాటు చేయడం అవసరమని, మండలంలో 9,695 బీడీ, వృద్ధ్దాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలోని ప్రతి ఆడపిల్ల కుటుంబానికి కల్యాణలక్ష్మి కింద రూ.1,00,116 లు ఇవ్వడం జరుగుతోందని, సరిహద్దు మండలమైన కుభీర్ మండలవాసులు మహారాష్ట్రకు మనకు తేడా గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో కుభీర్ సర్పంచ్ పానాజీ మీరా విజయ్కుమార్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్, ఎంపీపీ తూము లక్ష్మీ, బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రాంకిషన్రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, ఎంపీటీసీ బంక పోసానిబాయి, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహన్, వైస్ ఎంపీపీ మోహియోద్దీన్, మండల ఉపాధ్యక్షుడు దొడ్డికింది సాయిప్రసాద్ రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దత్తు గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రేకుల గంగాచరణ్, వైస్ చైర్మన్ మెంచు రమేశ్, ఎంపీటీసీ శ్యాంరావు, కుఫ్టి సర్పంచ్ రమేశ్, తహసీల్దార్ విశ్వంబర్, ఎంపీడీవో లింబాద్రి, ఎంఈవో చంద్రకాంత్ పాల్గొన్నారు.