భైంసా, ఫిబ్రవరి 13 : కుంటాల మండల అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల మండల కేంద్రంలో ‘మన ఊరు-మన బడి’, గజ్జలమ్మ ఆలయంలో గాలిగోపురం, ప్రహరీ, పీహెచ్సీలో వెల్నెస్ సెంటర్, సీసీ రోడ్ల నిర్మాణ పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రూ.1.64 కోట్లతో పాఠశాల, గాలి గోపురం, ప్రహరీ నిర్మాణానికి రూ.36 లక్షలు, రూ.6లక్షలతో వెల్నెస్ సెంటర్, ఉపాధి నిధులతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. గజ్జలమ్మ ఆలయానికి తనవంతు కృషి చేస్తానని ఇప్పటికే మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిధులు కేటాయించడంపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నాళ్లు సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని, ‘మన ఊరు-మన బడి’తో అనేక సౌకర్యాలు ఏర్పడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గంగామణి, సర్పంచ్ సమత వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ సట్ల గజ్జారాం, ఆత్మ చైర్మన్ అశోక్ రెడ్డి, మండల కన్వీనర్ పడకంటి దత్తు, నాయకులు బుచ్చన్న, జుట్టు మహేందర్, వెంకటేశ్, రమణారావు, నిర్మల్ జిల్లా సోషల్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ దశరథ్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్, ఉప సర్పంచ్ పద్మ-గజేందర్, జాగృతి అధ్యక్షుడు లక్ష్మణ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు రఘు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లోకేశ్వరం మండలంలో..
లోకేశ్వరం, ఫిబ్రవరి 13 : లోకేశ్వరం మండలంలోని హద్గాం, రాయపూర్ కాండ్లి రాజూరా పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి, విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకే కేసీఆర్ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ ప్రణాళిక రూపొందించిందన్నారు. నిరక్షరాస్యత నిర్మూలనే కేసీఆర్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. జడ్పీ మాజీ అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలితాభోజన్న, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ శ్యాంసుందర్, సింగిల్ విండో చైర్మన్ రత్నాకర్ రావు, మాజీ సర్పంచ్ మెండే శ్రీధర్, రాజేశ్ బాబు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు బండి ప్రశాంత్, దిగంబర్, పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
లోకేశ్వరం రైతు వేదికలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీం కేసీఆర్ అని అన్నారు. పేదలకు అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. చికిత్స చేయించుకోలేక పోతున్న పేదల కోసం సీఎం సహాయనిధి, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా చేయూతనందిస్తున్నారని తదితర విషయాలను చెప్పారు. తహసీల్దార్ సరిత, ఇన్చార్జి ఎంపీడీవో సాల్మన్ రాజ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు ప్రశాంత్, దిగంబర్ ఆయా గ్రామాల లబ్ధిదారులు పాల్గొన్నారు.