ఆదిలాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ప్రజాప్రతినిధులు, అధికారుల పరస్పర సహకారంతోనే జిల్లా అభివృద్ధి మరింత సాధ్యమవుతుందని ఆదిలాబాద్ జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. జడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అమలు చేసున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలితంగా ఆదిలాబాద్ జిల్లా ప్రగతిపథంలో దూసుకుపోతుందన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని సూచించారు. జడ్పీ సభ్యులు తమ ప్రాంతాల్లోని సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలో మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. గ్రామాల్లోని ఆలయ భూముల సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, కలెక్టర్ సిక్తా పట్నాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, జడ్పీ సీఈవో గణపతి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రూ.200 కోట్లతో రోడ్ల నిర్మాణాలు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా వివిధ రంగాల్లో గణనీయంగా అభివృద్ధి సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొమ్మిది ఏండ్లలో బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యాయి. మారుమూల గ్రామాలు, ఆదివాసీగూడలు, తండాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపర్చడంలో భాగంగా రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 200 కోట్లు మంజూరు చేసింది. అధికారులు రోడ్ల నిర్మాణ పనులు పకడ్బందీగా జరిగేలా చూడాలి. కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములై తమ ప్రాంతాల్లో అందరికీ పరీక్షలు జరిగేలా చూడాలి.
– రాథోడ్ బాపురావ్, ఎమ్మెల్యే, బోథ్
సమస్యలు పరిష్కరించుకోవాలి
ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే జిల్లా పరిషత్ సమావేశంలో ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లోని సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లబ్ధిదారులకు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలి. పథకాల కారణంగా జిల్లాలో ఎంతో అభివృద్ధి జరిగింది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి పథకాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
– అడ్డి భోజారెడ్డి, డీసీసీబీ చైర్మన్
మండల సమావేశాలకు హాజరుకాని వారిపై చర్యలు
వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న అధికారులు మండల సర్వసభ్య సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలి. జడ్పీసీఈవో ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి. సమావేశాలకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటాం. కస్తూర్బా, మోడల్ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. గతంలో జరిగిన సంఘటనల విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకున్నాం. ఉట్నూరు కమ్యూనిటీ దవాఖానలో ప్రసవాలు జరిగేలా వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి.
– కలెక్టర్ సిక్తా పట్నాయక్