తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. పలుచోట్ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో పాటు జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఆడబిడ్డలతో కలిసి ర్యాలీ తీశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఏకైక సర్కారు మనదేనని కొనియాడారు. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగినులు, ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు పంపిణీ చేశారు. ప్రొజెక్టర్ల ద్వారా పథకాలపై అవగాహన కల్పించారు. అక్కడక్కడా ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాళ్లు ఆకట్టుకోగా, విద్యార్థులు, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
నిర్మల్ చైన్గేట్, జూన్ 13 : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవం కనుల పండువగా సాగింది. ఆయాచోట్ల మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిర్మల్ పట్టణంలోని దివ్యగార్డెన్లో నిర్వహించిన మహిళా దినోత్సవంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పాల్గొని మాట్లాడారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదన్నారు. వివిధ రంగాల్లో కృషి చేసిన మహిళా ఉద్యోగినులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు, డీఆర్డీఏ సిబ్బందికి అవార్డులందించారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు రూ. 20 కోట్లు, స్త్రీనిధి ద్వారా రూ.5 కోట్ల చెక్కులను మహిళా సంఘాలకు అందించారు. అంతకుముందు మంత్రి అల్లోల బతుకమ్మతో సభా ప్రాంగణానికి వచ్చారు. కలెక్టర్ వరుణ్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ పాల్గొన్నారు.
భైంసా, జూన్ 13 : పట్టణంలోని ఎన్ఆర్ గార్డెన్లో మహిళా సంక్షేమ దినోత్సవంలో ఎమ్మెల్యే విఠల్రెడ్డి తెలంగాణ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం అన్ని మండలాల ఐకేపీ సిబ్బందికి రూ.15 కోట్ల చెక్కును అందజేశారు.
ఖానాపూర్ టౌన్, జూన్ 13 : పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్ హాల్లో వేడుకలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ప్రొజెక్టర్ ద్వారా మహిళా సంక్షేమం గురించి డాక్యుమెంటరీ ప్రదర్శించారు.
ఎదులాపురం, జూన్ 13 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జనార్దన్ గార్డెన్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కలెక్టర్ రాహుల్రాజ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి హాజరయ్యారు. ముందుగా వీరికి చిన్నారులు నృత్యాలతో స్వాగతం పలికారు. వివిధ శాఖల్లో ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులు, వార్డు కౌన్సిలర్, ఎంపీపీ, జడ్పీటీసీలు, అంగన్వాడీ టీచర్లులకు మెమొంటో అందజేసి శాలువాతో సత్కరించారు.
బోథ్, జూన్ 13 : బోథ్లోని పరిచయ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పాల్గొన్నారు. తెలంగాణ రథసారథి కళాబృందం ఆధ్వర్యంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను జానపద గేయాల రూపంలో సభికులకు వివరించారు.
కాగజ్నగర్, జూన్ 13 : పట్టణంలోని సంతోష్ ఫంక్షన్ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. అనంతరం పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన చిరుధాన్యాల వంటకాల స్టాళ్లు ఆకట్టుకున్నాయి.
ఆసిఫాబాద్, జూన్ 13 : జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి గార్డెన్లో జరిగిన మహిళా సంక్షేమ దినోత్సవానికి జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ చాహత్బాజ్పాయి, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమం ఆకట్టుకున్నది.
చెన్నూర్, జూన్ 13 : పట్టణంలోని హబీబ్ ఫంక్షన్ హాల్లో అదనపు కలెక్టర్ రాహుల్ పాల్గొన్నారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు పౌష్టికాహారంతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఉత్తమ మహిళలను అధికారులు సన్మానించారు.
బెల్లంపల్లి, జూన్ 13 : పట్టణంలోని పద్మశాలీ భవన్లో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జాయింట్ కలెక్టర్ మధుసూదన్నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ గౌతమితో కలిసి పాల్గొన్నారు. జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జడ్పీ సీఈవో నరేందర్ ఉన్నారు.
మంచిర్యాల అర్బన్, జూన్ 13 : జిల్లా కేంద్రంలోని ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే దివాకర్రావు, కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొన్నారు. ఐసీడీఎస్ కార్యాలయం వద్ద కలెక్టర్ బదావత్ సంతోష్ ర్యాలీని ప్రారంభించారు. మహిళలు బతుకమ్మలతో ర్యాలీ తీశారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు. సెల్ఫ్ ఎంప్లాయీమెంటు పథకం కింద నలుగురు దివ్యాంగులకు, ముగ్గురు ట్రాన్స్జెండర్లకు ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున చెక్కులు అందజేశారు. విద్యార్థినుల సాంస్కృతిక నృత్యం ఆకట్టుకుంది.