కేస్లాపూర్ నాగోబా జాతరకు భక్త జనం రోజురోజుకూ పెరుగుతున్నది. నాలుగో రోజూ శుక్రవారం పెద్ద సంఖ్యలో తరలిరాగా, ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆరాధ్య దైవానికి వైభవంగా పూజలు చేయడంతో పాటు తమ సంప్రదాయ నృత్యాలు చేస్తూ గిరిజనం ఆకట్టుకుంది. పరిసరాల్లోని దుకాణాలు, రంగులరాట్నాల వద్ద సందడి నెలకొంది.
ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 4: ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబాను దర్శించుకొనేందుకు ఆయా ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. జిల్లాలోని నలుమూలలతోపాటు వివిధ రాష్ర్టాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి నాగోబాకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులు రాకతో ఆలయంతోపాటు జాతరలోని పరిసరాలు శుక్రవారం కిక్కిరిశాయి.
ఆలయ ఆవరణలో మెస్రం వంశీయులు మండగాజిలింగ్ పూజలు చేశారు. ముందుగా నాగోబాతోపాటు సతీదేవతలను దర్శించుకున్న భక్తులు వేసిన కానుకల(పావుడి డబ్బులు)లను పటేల్ కిత్త, కటోడ కిత్త, పర్ధాంజీ కిత్తల వారీగా డబ్బు పంచుకున్నారు. అనంతరం మెస్రం వంశీయులతోపాటు వారి బంధువులకు ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్రావ్పటేల్, చిన్నూపటేల్, బాధిరావ్, లింబారావ్పటేల్, కటోడ కోసురావ్, పర్ధాంజీ మెస్రం దాదారావ్, కటోడ హనుమంత్రావ్, కోశరావ్, నాగోబా పేన్ కోత్వాల్ తిరుపతి, గణపతి, దేవ్రావ్, రాము, గంగారాం, మారుతి పాల్గొన్నారు.
మెస్రం వంశీయల పీఠాధిపతి కాగడాలు వెలిగించి, బేతాల్ పూజలు ప్రారంభించారు. నేలపై తంబాకు వేసి అక్కడి నుంచి నాగోబాను మొక్కుకున్నారు. అనంతరం సంప్రదాయ వాయిద్యాలు, నృత్యాలతో గోవాడ్కు చేరుకున్నారు. గోవాడ్ పక్కన పటేల్ గాది ఏర్పాటు చేసి, బేతాల్దేవత పూజలపై మెస్రం వంశీయులతోపాటు మహిళలకు వివరించారు. మెస్రం వంశీయుల మహిళలు పెద్దల పాదాలు కడిగారు.అనంతరం సంప్రదాయ వాయిద్యాలతో మహిళలు, పురుషులు వేర్వేరుగా నృత్యాలు చేశారు. సాయంత్రం కేస్లాపూర్ నుంచి కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లతో ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్లోని బుడుందేవ్ జాతరకు బయల్దేరనున్నట్లు పెద్దలు తెలిపారు.
ఉట్నూర్ మండలం దంతన్పల్లికి చెందిన కొలాం ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో ముత్యాల దేవతను గురువారం రాత్రి నాగోబాకు భేటింగ్ చేయించారు. కొలాం గిరిజనులు ఆలయంలో పూజలు చేసి నాగోబాను దర్శించుకున్నారు. కార్యక్రమంలో కాశీరాం, అయ్యూబాయి, కోసేరావ్, తుకారాం పాల్గొన్నారు.
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు శోభారాణి, దేవయ్య, బృందేశ్వర్ నాగోబాను దర్శించుకొని పూజలు చేశారు. మెస్రం వంశీయులు వారిని సన్మానించి నాగోబా ఫొటో అం దించారు. కార్యక్రమంలో మెస్రం వంశీయులు దేవ్రావ్, శేఖర్బాబు, తుకారాం, ఆలయ పూజారి మెస్రం షేకు, ఆదిలాబాద్ శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మందిరం పీఠాధిపతి యోగానంద సరస్వతి నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మెస్రం వంశీయులు శేఖర్బాబు, మెస్రం జంగుపటేల్, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.