ఆదివాసుల ఆరాధ్యదైవం నాగోబాను దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిస్తున్నారు. జిల్లాతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి వేలాది మంది కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లు, వాహనాలపై వస్తుండడంతో కేస్లాపూర్ కోలాహలంగా మారింది. దుకాణాలతోపాటు రంగుల రాట్నాల వద్ద ప్రజల రద్దీ నెలకొంది. వివిధ శాఖల అధికారులు తమ సేవలను కొనసాగిస్తున్నారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని ఆలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన భవనంపై జాతీయ జెండా ఎగురవేశారు.
ఇంద్రవెల్లి, జనవరి 26 : ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబాను దర్శించుకోవడాని కి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. నాగోబాను దర్శించుకునేందుకు ఆయా ప్రాంతాల నుంచి వేలాదిమంది గురువారం కుటుంబసమేతంగా తరలివచ్చారు. ఎడ్లబండ్లతోపాటు ప్రత్యేక వాహనాల్లో ప్రజలు జాతరకు వస్తున్నారు. భక్తుల రద్దీ పె రగడంతో ఆలయంతోపాటు జాతరలోని పరిసరాల్లో సందడి కనిపించింది. ఆదివాసీ గిరిజనులతోపాటు ఇతర భక్తులు నాగోబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉద యం 11 గంటల నుంచి సాయం త్రం వరకు భక్తులు పిల్లాపాపలతోపాటు కుటుంబసమేతంగా దర్శనం కోసం బారులు తీరా రు. జాతరలో వెలిసిన దుకాణాలు, రంగుల రాట్నాల వద్ద ప్రజల రద్దీ కనిపించింది. నాగోబా ఆలయాభివృద్ధి కోసం మెస్రం వంశ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పా టు చేశారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపడుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో భక్తులతోపాటు వ్యాపారులకు మాస్క్లు పంపిణీ చేశారు.
నాగోబా జాతర సందర్భంగా భక్తులకు కల్పించిన సౌకర్యాలతోపాటు ఏర్పాట్లను ఉట్నూర్ ఆర్డీవో కదం సురేశ్, డీపీవో శ్రీనివాస్, డీఎల్పీవో భిక్షపతిగౌడ్, ఐటీడీఏకు చెందిన అధికారులు పరిశీలిస్తున్నా రు. జాతరలో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టి శుభ్రత పాటిస్తున్నారు. భక్తులకు తాగునీటి కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జాతరలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్య సహాయం అందిస్తున్నారు.
నాగోబా జాతరను పురస్కరించుకొని మెస్రం వంశీయుల ఆధ్వర్యం లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాగోబా ఆలయ అవరణలో నూతనంగా నిర్మిస్తున్న భవనం స్లాబ్పై మెస్రం వంశీయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలపై అవగాహన
నాగోబా జాతరలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన కంటి వెలుగుతోపాటు విద్య, వైద్యం, సంక్షేమ పథకాలపై గిరిజనులకు పాటల ద్వారా వివరిస్తున్నారు.