మంచిర్యాల అర్బన్, జనవరి 29 : పదో తరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా బోధన, రివిజన్, ప్రిపరేషన్ చేయించాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ యాదయ్య అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్లో జన్నారం, కోటపల్లి, వేమనపల్లి, బెల్లంపల్లి, కాసిపేట, తాండూరు, నెన్నెల, భీమిని, కన్నెపల్లి మండలాల ప్రభుత్వ, కేజీబీవీ, ఎయిడెడ్, మోడల్ స్కూళ్ల హెచ్ఎంలతో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ నెల 31వ తేదీలోగా ప్రతి పాఠశాలలో పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులను పరీక్షలకు ఎలా సంసిద్ధులను చేయాలో హెచ్ఎంలు రివ్యూ చేస్తూ 100 శాతం ఫలితాలు సాధించడానికి ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు కచ్చితంగా నిర్వహిస్తూ రివిజన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీజీఈ దామోదర్ రావు, డీసీఈబీ సెక్రటరీ కొండు భీంరావు, ఎంఈవోలు తిరుపతి రెడ్డి, విజయ్కుమార్, ప్రభాకర్, మహేశ్వర్ రెడ్డి, సెక్టోరల్ అధికారి సత్యనారాయణ మూర్తి, యశోధర పాల్గొన్నారు.