శ్రీరాంపూర్, జనవరి 22 : పెన్షన్ పెంచి.. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సింగరేణి రిటైర్డ్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కార్పొరేట్ కొత్తగూడెం హెడ్డాఫీస్ ఎదుట ధర్నా చేశారు. సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంచందర్రావు, డిప్యూటీ ప్రధాన కార్యదరిశ అలవందార్ వేణుమాధవ్, ఉపాధ్యక్షుడు భీరయ్య ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
అనంతరం ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, శేషయ్యతో కలిసి సీఎండీ బలరామ్కు వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం, 6 గ్యారంటీ స్కీమ్లు రిటైర్డ్ కార్మికులకు అమలు చేయాలని, తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మిరెడ్డి, రాజయ్య, వెంకటేశ్వర్లు, వెంకటయ్య, వెంకట్ పాల్గొన్నారు.