మంచిర్యాల, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం చేపట్టిన గ్రామీణ భారత్ బంద్లో నిరసనలు హోరెత్తాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కార్మిక సంఘా లు, వివిధ రాజకీయ పార్టీలు కేంద్రంపై కన్నెర్ర జేస్తూ ఆందోళనలు నిర్వహించాయి. రెబ్బెన, గోలేటి సీహెచ్పీల వద్ద ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ఏరియాలోని ఖైర్గూడ ఓసీపీ, బీపీ ఏవోసీపీ గనులతో పాటు వివిధ డిపార్ట్మెంట్లు, గోలేటి జీఎం కార్యాలయంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిలి, ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్ కార్మికులకు, ఉద్యోగులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
పెంచికల్పేట్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్ల మండల అధ్యక్షురాలు రాజమణి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. సీఐటీయూ మద్దతు తెలిపింది. సిర్పూర్(యు) మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో జీపీ కార్మికులు, ఆశ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఐకేపీ ఉద్యోగులు సమ్మె చేపట్టారు. కారోబార్ సంఘం మండలాధ్యక్షుడు గోడం శెడ్మరావ్ పాల్గొన్నారు.
మంచిర్యాలలో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఏఐటీయూసీ కార్యాలయం నుంచి మంచిర్యాల రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ తీశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజలు, కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కోటపల్లి మండల కేంద్రంలో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు పర్మినెంట్ చే యాలని, సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ మండల కార్యదర్శి కావెర రవి డిమాం డ్ చేశారు.
దండేపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీసి.. నిరసన తెలిపారు. శ్రీరాంపూర్, నస్పూర్లో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. శ్రీరాంపూర్ ఏరియా గనులపై ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు జే శంకర్రావు ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సింగరేణి గనులు సంస్థకు అప్పగించాలని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీసీసీ కార్నర్ వద్ద సీపీఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వీరభద్రయ్య, సమ్మయ్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేశారు.
శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్కుమార్, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియా నుంచి కాంటా చౌరస్తా వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జైపూర్లో ఎస్టీపీపీ కాంట్రాక్టు కార్మికులు సమస్యలు పరిష్కారించాలని జీఎం బస్విరెడ్డికి వినతిపత్రం అందించారు. మందమర్రి పట్టణంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు నిరసనలు తెలిపారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట కోల్బెల్ట్ రహదారిపై రాస్తారోకో చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు జీఎం కార్యాలయం ఎదుట, ఏరియా స్టోర్, వర్క్షాప్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. తాండూర్లోని బీపీఏ ఓసీపీ-2 వద్ద ఐఎన్టీయూసీ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్, సీనియర్ నాయకుడు సంగెం ప్రకాశ్రావు ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.