ఎదులాపురం, మార్చి 17 : గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా నేరాలపై సమీక్ష, నమోదైన కేసుల పురోగతి, వర్టికల్స్, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు, ఎన్బీడబ్ల్యూ, సైబర్ క్రైమ్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి మొదటి నుంచి జిల్లా పోలీసులు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు.
ప్రతి రోజూ సాయంత్రం హైవేలపై, పట్టణాలు, గ్రామాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ద్విచక్రవాహనాల రోడ్డు ప్రమాదాల తగ్గింపులో కీలక పాత్ర పోషించారన్నారు. జిల్లా ఇతర రాష్ర్టాల సరిహద్దును పంచుకుంటున్నదని, సరిహద్దు పోలీస్ స్టేషన్లలో పకడ్బందీగా గస్తీ నిర్వహిస్తూ రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, ఓఎస్డీ బీ రాములు నాయక్, డీటీసీ సీ సమయ్జాన్రావు, డీఎస్పీలు వీ ఉమేందర్, పోతారం శ్రీనివాస్, సీఐలు పురుషోత్తం, సత్యనారాయణ, మల్లేశ్, ఆర్ఐ సీఐలు, ఎస్బీ, డీసీఆర్బీ, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ పతకాలు అందజేత
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి పథకాలను అందజేస్తున్నది. ఈ మేరకు వచ్చిన పతకాలను పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిబ్బందికి ఎస్పీ అందజేశారు. కాగా, 250 మంది సిబ్బందికి మూడు సంవత్సరాలుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నాటిన మామిడి మొక్కల సంరక్షణ పూర్తి బాధ్యతలు అప్పగించారు. సర్వీసులో ఉన్నంతకాలం మొక్క సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు. సాయుధ సిబ్బంది సమస్యలపై సమావేశం నిర్వహించారు. సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎస్ శ్రీనివాసరావు, సీ సమయ్జాన్రావు, బీ రాములునాయక్, డీఎస్పీలు వీ ఉమేందర్, ఉమామహేశ్వరరావు, పోతారం శ్రీనివాస్, ఆర్ఐ సీఐ, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐకి మెడల్
ఆదిలాబాద్ టౌన్, మార్చి17: ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐ నాగనాథ్కు స్వర్ణోత్సవ మెడల్ లభించింది. స్వాతంత్య్ర భారత స్వర్ణోత్సవాల జ్ఞాపికగా ఉత్తమ సేవలు అందించి ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఈ మెడల్స్ అందజేస్తున్నది. అందులో భాగంగానే ఎస్పీ కార్యాయలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐకి ఈ మెడల్ను ఎస్పీ అందజేసి అభినందించారు. కాగా.. ఎస్ఐకి మెడల్ రావడంపై మండలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉట్నూర్ ఎస్ఐకి..
ఉట్నూర్, మార్చి 17 : ఉట్నూర్ ఎస్ఐ భరత్ సుమన్కు స్వర్ణోత్సవ మోడల్ను ఎస్పీ ఉదయ్రెడ్డి అందజేశారు. పోలీస్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది అత్యంత చురుకుగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ మోడల్ అందుకోవడం సంతోషకరమని ఎస్ఐ పేర్కొన్నారు.