రామకృష్ణాపూర్, డిసెంబర్ 20 : ప్రజలకు అందుబాటులో ఉండి చట్టపరిధిలో సమస్యలు పరిష్కరిస్తూ వారి మన్ననలు పొందేలా పని చేయడం పోలీసుల ప్రధాన లక్ష్యమని మంచిర్యాల డీసీపీ సుధీర్రాంనాథ్కేకన్ సూచించారు. బుధవారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. అధికారులతో కలిసి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవరిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవాలన్నారు. జాప్యం చేయకుండా పరిష్కరించాలని ఆదేశించారు.
ఫంక్షనల్ వర్టికల్స్ పనితీరు మెరుగుపర్చడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. పాత నేరగాళ్లపై నిఘా ఉంచాలని, 100 డయల్ ఫిర్యాదులపై వేగవంతంగా స్పందిస్తూ సేవలందించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో బీట్లు, పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను నియంత్రించాలని తెలిపారు. రోజు వారీగా వాహనాలు తనిఖీ చేస్తూ, నంబర్ ప్లేట్లు సరిగ్గా లేని వాహనాలపై నిఘా పెట్టాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్పై కఠినంగా వ్యవరించాలన్నారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలతో పాటు యువతను అప్రమత్తం చేయాలని సూచించారు. పోలీసులు అంటే ప్రజల్లో గౌరవం పెరిగేలా ప్రతి ఒక్కరూ ప్రవర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య, మందమర్రి సీఐ మహేందర్రెడ్డి, టౌన్ ఎస్ఐ జీ రాజశేఖర్ పాల్గొన్నారు.