కోటపల్లి, డిసెంబర్ 21 : పోలీస్శాఖపై నమ్మకం పెరిగేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ సిబ్బందికి సూచించారు. గురువారం కోటపల్లి పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, సరిహద్దు భద్రత.. తదితర అంశాలపై సూచనలు చేశారు. కోటపల్లి మండలం మహారాష్ట్రకు సరిహద్దుగా ఉందని, మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
నిత్యం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని, ప్రజలతో స్నేహం పెంచుకోవాలని సూచించారు. వివిధ రంగాల్లో యువతకు శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించాలని, మెడికల్ క్యాంప్లు నిర్వహించాలన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చే వారితో మర్యాదగా మెలగాలని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గ్రామాల్లో గస్తీ పెంచాలని చెప్పారు. పాత నేరగాళ్లపై నిఘా ఉంచాలని, డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం పెట్రోలింగ్ నిర్వహిస్తూ నేరాలు నియంత్రించాలన్నారు. రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన 5-ఎస్ విధానం తీరుని అడిగి తెలుసుకున్నారు. పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ మోహన్, చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్, కోటపల్లి ఎస్ఐ సురేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.