ఇంద్రవెల్లి, అక్టోబర్ 21 : మండలకేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో గోండ్గూడ, ధుర్ముగూడ గ్రామాలకు చెందిన గుస్సాడీలతో పాటు బృందం సభ్యులు ఆదివాసీ గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. ఇంద్రాదేవి ఆలయానికి శుక్రవారం తరలివచ్చిన గుస్సాడీ బృందం సభ్యులు దేవికి నైవేద్యాలు సమర్పించారు. మహిళలు, పురుషులు వేర్వేరుగా దండారీ నృత్యాలు చేస్తూ ఆడిపాడారు. ఆలయ ఆవరణలో సామూహిక వంటలు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజనులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
స్వరాష్ట్రంలోనే దండారీకి గుర్తింపు
నార్నూర్, అక్టోబర్ 21 : దండారీ ఉత్సవాలకు స్వరాష్ట్రంలోనే గుర్తింపు లభించిందని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని బలాన్పూర్ గ్రామంలో నిర్వహించిన దండారీ ఉత్సవాల్లో ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్తో కలిసి పాల్గొన్నారు. ఆదివాసీలు, గుస్సాడీలు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. ఏత్మాసూర్ పేన్కు ఆదివాసీ సంప్రదాయ పూజలు చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 వేలను దండారీ నిర్వాహకుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దండారీ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసిందన్నారు. జిల్లాలోనే మొదటమొదటి సారిగా బలాన్పూర్ గ్రామంలో దండారీ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ దీలిప్కుమార్, ఎంపీపీ కనక మోతుబాయి, సర్పంచ్ ఆత్రం పరమేశ్వర్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా నాయకుడు ఇన్సూ అక్బానీ, ఎమ్మెల్యే తనయుడు ఆత్రం వినోద్కుమార్, జీవవైవిధ్య జిల్లా కమిటీ సభ్యుడు మర్సుకోల తిరుపతి, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావ్, రాయిసెంటర్ జిల్లా సార్మేడి మెస్రం దుర్గుపటేల్, గ్రామపెద్దలు పాల్గొన్నారు.